లగడపాటి ఆత్మహత్యాయత్నం చేస్తాడనుకున్నాం, నేనైతే ఏడ్చేశా: పొన్నం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును లోకసభలో ప్రవేశపెట్టిన రోజు తమ పార్టీ అప్పటి పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఏం చేస్తాడనేదే తమకు ఉత్కంఠగా మారిందని కాంగ్రెసు తెలంగాణ మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఓ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించిన విషయాలను చెప్పారు.
తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లడం అప్పుడు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ రోజు 2014 ఫిబ్రవరి 14వ తేదీన బిల్లును లోకసభలో ప్రవేశపెట్టబోతున్నారని, బిల్లును ఏలాగైనా అడ్డుకుంటానని అంతకు ముందు రోజు లగడపాటి ప్రకటించారని, దాంతో ఆయనేం చేస్తాడా అనే ఉత్కంఠ తమలో నెలకొందని పొన్నం ప్రభాకర్ చెప్పారు.
ముందు రోజు కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులమంతా సమావేశమై లగడపాటిని ఎలా అపాలనే విషయంపై చాలా సేపు చర్చించామని, లగడపాటి ఆత్మహత్యాయత్నం చేసుకుంటారని తాము అనుకున్నామని, లగడపాటి ఏం చేసినా దాన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నామని ఆయన వివరించారు.
స్పీకర్ బిల్లును చదువుతుండగానే ఆంధ్ర ఎంపిలంతా నిరసన తెలియజేయడం ప్రారంభించారని, తాము ప్రతిగా నిరసన వ్యక్త చేశామని, అయితే అంత జరుగుతున్నా లగడపాటి ఏం చేస్తారనే ఉత్కంఠ తమను వీడలేదని చెప్పారు. అకస్మాత్తుగా ఏదో పొగ, పొడి తమపై కమ్ముకుందని, చేతిలో ఏదో సెంట్ బాటిల్ లాంటిదాన్ని చల్లసాగాడని ఆయన చెపపారు.
ఎలాగైనా అపాలని తామంతా కలిసి అతనిపై పడ్డామని, లగడపాడి పక్కనే బ్యాగ్ ఉందని, దాన్నిండా అవే బాటిళ్లు ఉన్నాయని, వాటన్నింటినీ స్ప్రే చేయడం వల్లనే పార్లమెంట్ లాబీ అంతా అది వ్యాపించిందని ఆయన అన్నారు. తనకైతే కళ్లు పోయాయని అనుకున్నానని, కళ్లు మంటపెట్టడంతో తీవ్రంగా విలపించానని, ఆస్పత్రిలో చికిత్స తర్వాత ఈ లోకాన్ని చూడగలిగానని ఆయన వివరించారు.
రాష్ట్ర విభజన బిల్లును లోకసభలో ప్రవేశపెట్టన రోజు లగడపాటి రాజగోపాల్ ఏం చేస్తారనే ఉత్కంఠనే తమను వెంటాడుతూ వచ్చిందని, ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతాడని భావించామని పొన్నం ప్రభాకర్ చెప్పారు.