బీసీలను ఎందుకు విస్మరించారు, ముక్కు నేలకు రాయి: కెసిఆర్పై పొన్నం సంచలనం
కరీంనగర్: బీసీ సంక్షేమం విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై టీపీసీసీ ఉపాధ్యక్షుడు , కరీంగనర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం బీసీలకు న్యాయం చేయనందుకు సీఎం కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీసీ సంక్షేమాన్ని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గతంలో పలుమార్లు పొన్నం ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కెసిఆర్ ప్రభుత్వం బిసిలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోందని పొన్నం విమర్శలు గుప్పించారు. అయితే బిసి సంక్షేమాన్ని రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు విస్మరించారని పొన్నం ఆరోపించారు.
బీసీల సంక్షేమంపై పొన్నం సంచలన వ్యాఖ్యలు
ఇంతకాలం పాటు బీసీలకు న్యాయం చేయనందుకు సీఎం కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని కరీంనగర్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.బీసీల సంక్షేమాన్నిమూడేళ్ళ పాటు కెసిఆర్ విస్మరించారని ఆయన ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కెసిఆర్ బీసీలపై కపట ప్రేమ చూపుతున్నారని ఆయన ఆరోపించారు.
బీసీల సంక్షేమంపై శ్వేత పత్రం
బీసీల సంక్షేమంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కెసిఆర్ ప్రభుత్వాన్ని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.గత నాలుగు బడ్జెట్ లలో బీసీల సంక్షేమానికి ఎన్ని నిధులు కేటాయించి ఎంత ఖర్చు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.మూడున్నర ఏళ్లుగా బీసీలను ఎందుకు నిర్లక్ష్యం చేశారో సీఎం సమాధానం చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో లబ్దికోసమే
రానున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కెసిఆర్ ప్రభుత్వం బీసీలకు ఎన్నికల నజరానా ప్రకటిస్తున్నారని విమర్శించారు. బీసీలపై కెసిఆర్ కు ప్రేమ ఉంటే ఇంత కాలం ఎందుకు బీసీలను విస్మరించారో చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు.
ఆ రెండు పదవుల్లో ఏదో ఒకటి బీసీలకివ్వాల్సిందే
బీసీలపై కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ అధ్యక్ష పదవి లేదా సీఎం పదవి.. ఏదో ఒకటి బీసీలకు ఇవ్వాలన్నారు. కులాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు క్షమించరని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులుగా ఉన్న బీసీలకు తగిన గౌరవాన్ని ఇవ్వడం లేదని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.