ఇంటర్ ఫలితాల రగడ ...విద్యార్థులవి ఆత్మహత్యలు కావు .. ప్రభుత్వ హత్యలు - పొన్నం ప్రభాకర్
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలని ఆయన అభిప్రాయపడ్డారు.
చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని పొన్నం డిమాండ్
హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాల్లో అవకతవకల కారణంగా నేటికి 23 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు.ఈ 23 మంది పిల్లలు చనిపోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆరే కారణమని ఆయన ఆరోపించారు. చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని పొన్నం డిమాండ్ చేశారు.
త్రిసభ్య కమిటీ తప్పులు జరిగినట్టు నివేదిక ఇచ్చినా చర్యలు శూన్యం అని పొన్నం ఫైర్
తెలంగాణ ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంభిస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఇంటర్ బోర్డు వెల్లడించిన ఫలితాల్లో తప్పులు జరిగినట్టు త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గ్లోబరీనా సంస్థతో సీఎం కేసీఆర్కు సంబంధం లేకుంటే ఇంటర్ బోర్డు ఎందుకు తమతోపాటు ఆందోళనలు చేయడం లేదని ప్రశ్నించారు.
విద్యార్థులవి ఆత్మహత్యలు కాదు ,ప్రభుత్వ హత్యలు అన్న పొన్నం
ఇంటర్మీడియట్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. 23 మంది విద్యార్థులు మృతి చెందినా కేసీఆర్ మనసు చలించలేదన్నారు. విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా చేయించాలని, బోర్డు సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని, గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలని, ఆత్మహత్యలు చేసుకున్న అవన్నీ కూడా ప్రభుత్వమే హత్య కేసులుగా నమోదు చేసి వారి కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.