హైద్రాబాద్లో మతమార్పిడులు: చిన్న పిల్లలే లక్ష్యం, 9 మంది అరెస్ట్
పేదరికాన్ని ఆసరాగా చేసుకొని మత మార్పిడులకు పాల్పడుతున్న ఓ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశ్రమం పేరుతో చిన్న పిల్లలను మత మార్పిడులకు పాల్పడుతున్నారని పోలీసులు ప్రకటించారు.
హైదరాబాద్: పేదరికాన్ని ఆసరాగా చేసుకొని మత మార్పిడులకు పాల్పడుతున్న ఓ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశ్రమం పేరుతో చిన్న పిల్లలను మత మార్పిడులకు పాల్పడుతున్నారని పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనకు పాల్పడుతున్న 9 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఆశ్రమంలో ఉంటున్న 17 మంది చిన్న పిల్లలను పోలీసులు రక్షించి స్టేట్ హోంకు తరలించారు.
సత్యనారాయణ అలియాస్ సిద్దిఖీ పేద పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించే ఉద్దేశ్యంతో ఆశ్రమాలు ఏర్పాటు చేస్తున్నారని ప్రచారం చేసుకొంటారని పోలీసులు చెప్పారు. ఆశ్రమంలో చేరిన పిల్లలను బలవంతంగా మతమార్పిడులు చేస్తున్నారని గుర్తించినట్టు రాచకొడం సిపి మహేష్ భగవత్ చెప్పారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని భద్రాచలం, సూర్యాపేట, రాజమండ్రి తదితర ప్రాంతాల నుండి పిల్లలను ఆశ్రమంలో చేర్చారని సిపి చెప్పారు. వీరంతా గిరిజనులేనని ఆయన చెప్పారు
ఆశ్రమ నిర్వాహకుడు తొలుత హిందువేనని చెప్పారు. అయితే కారణాలేమిటో తెలియదు కానీ, సత్యనారాయణ ముస్లిం మతాన్ని స్వీకరించాడని పోలీసులు చెప్పారు. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆశ్రమాలను సత్యనారాయణ అలియాస్ సిద్దిఖీ నిర్వహించారు.
తాజాగా మౌలాలి సమీపంలో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఎన్ఐఏ నుండి వచ్చిన సమాచారం మేరకు రాచకొండ పోలీసులు ఈ ఆశ్రమం మీద దాడి చేశారు. ఈ ఆశ్రమంలో ఉన్న 17 మంది పిల్లలను స్టేట్హోంకు తరలించారు. పోలీసులు రక్షించిన వారిలో 3 అమ్మాయిలు కూడ ఉన్నారు.