కెసిఆర్ది చిన్న పిల్లల తత్వం, చంద్రబాబుపై వద్దులే: పోసాని కృష్ణమురళి
కె. చంద్రశేఖర రావుపై తెలుగు సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తెలుగు సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మాత్రం మాట్లాడడానికి నిరాకరించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధికారిక పత్రిక నమస్తే తెలంగాణ జిందగీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కెసిఆర్పై ఆయన వ్యాఖ్యలు చేశారు. ఒకరకంగా ఆయన కెసిఆర్ను ఆకాశానికెత్తారు. పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు ఎప్పుడూ సంచలనాత్మకంగా ఉండడం కొత్తేమీ కాదు.
చంద్రబాబు గురించి తాను వ్యాఖ్యానించదలుచుకోలేదని ఆయన అన్నారు. దాంతో ఆగకుండా చంద్రబాబు గురించి అందరికీ తెలిసిందేనని అన్నారు.
కెసిఆర్ది చిన్నపిల్లల మనస్తత్వం...
కేసీఆర్ది చిన్నపిల్ల మనస్తత్వమని, ఆయనకు కోపం వచ్చినా తట్టుకోరని పోసాని కృష్ణమురళి అన్నారు. కెసిఆర్ ఒక మనిషిని ప్రేమించినా అంతేలా ప్రేమిస్తారని, తిట్టిన వారు సైతం కేసీఆర్ దగ్గరికి పోయి దండం పెడితే వెంటనే ఆయన సాయం చేస్తారని అన్నారు. పాత విషయాలన్నీ మరిచిపోతారని, అంత గొప్ప మనస్తత్వమని అన్నారు.
తెలంగాణ వాళ్లతో అనుబంధం
తనకు ఎక్కువగా తెలంగాణ వాళ్లే స్నేహితులని పోసాని కృష్ణమురళి అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ సీఎం కావాలని కోరుకున్న వారిలో తానూ ఒక్కడినని చెప్పారు. ఎందుకంటే ఆయన తెలంగాణ కోసం చాలా కష్టపడారని, ఆయన ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తన నమ్మకమని, తాను అనుకున్నట్టే ఆయన సీఎం అయ్యారని అన్నారు.
Recommended Video
ప్రతిపక్షాలపై రాళ్లు....
తెలంగాణలోని ప్రతిపక్షాలపై పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ -అభివృద్ధి చేయలేని వారు.. అభివృద్ధి చేసేవారిని తిట్టడం సమాజంలో మామూలేనని అన్నారు. మన దగ్గర రాజకీయ నాయకులు ఎలా ఉంటారో మనకు తెలియదా? అని ప్రశ్నించారు. వాళ్లు అలా తిడితేనే వారికి గుర్తింపు వస్తుందని, వాళ్లని ప్రజలు గుర్తుంచుకోవాలంటే పని చేసే వారిని తిట్టాలని అన్నారు. ఎవరు ఎన్ని విమర్శించినా కేసీఆర్కు వచ్చే నష్టం లేదని, అది వారికి కూడా తెలుసునని అన్నారు. వారు బతుకాలంటే సీఎం మీద నాలుగు రాళ్లు ఎక్కువ వేయాలని, కుటుంబ పాలన అని ఆయన్ను విమర్శిస్తారు కానీ అది తనకు అర్థం కాలేదని పోసాని అన్నారు.
లాఠీ దెబ్బలు తిన్నారు...
కేటీఆర్, హరీష్రావు, కవిత తెలంగాణ కోసం లాఠీ దెబ్బలు తిన్నారని, అప్పుడు ఎవరూ స్పందించలేదని పోసాని అన్నారు. ఇప్పడు మాత్రం అంటారని దెప్పిపొడిచారు. ఇదేం చోద్యమో తనకు అర్థం కాదని, ఎవ్వరు ఆయన వెంట ఉన్నా ఉండపోయినా కేసీఆర్కు మాత్రం ఆ దేవుడు వెంట ఉంటాడని పోసాని చెప్పారు.
కేసీఆర్ మూడేళ్ల పాలనపై...
రైతుల రుణమాఫీ, కరెంట్ 24 గంటలు, కురుమలకు గొర్రెల పంపిణీ, డబుల్ బెడ్రూం ఇళ్లు, వికలాంగులకు పింఛను పంపిణీ లాంటి వాటితో పాటు ఇంకా చాలా పథకాలను కేసీఆర్ ప్రవేశపెట్టారని, వాటిని అలాగే అమలు చేస్తున్నారని పోసాని అన్నారు. గత ప్రభుత్వాలు వేయించిన రోడ్లు, ప్రభుత్వం కట్టించిన ఇళ్లను ఇప్పుడు కడుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను చూడాలని, మీకే తెలుస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో కట్టించిన ఇళ్లు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధిని చూసే చాలామంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు.
మచ్చికచేసుకోవడానికి కాదు...
తాను ఏదో కెసిఆర్ను మచ్చిక చేసుకోవడానికి ఇవన్నీ చెప్పడం లేదని పోసాని కృష్ణమురళి అన్నారు. కెసిఆర్ చేసిన పనులను కళ్లారా చూసి చెబుతున్నానని అన్నారు. కెసిఆర్ అందరి గురించి పట్టించుకున్నారని, తెలంగాణ రాకముందు కేసీఆర్ దేవుడన్న వారు ఇప్పడు దయ్యం అన్నంత మాత్రాన అది నిజం కాదని, అది ఎవరూ నమ్మరని ఆయన అన్నారు.
కేటిఆర్కు లోకేశ్కు ఉన్న తేడా
తెలంగాణ రాకముందు కేసీఆర్ వెంట నడిచి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక భాగమయ్యారో ఇప్పుడు అలానే కెటిఆర్ కష్ట పడుతున్నారని పోసాని కృష్ణ మురళి అన్నారు. కెటిఆర్ ఎప్పుడూ కేసీఆర్ను పొగుడుకుంటూ ఉండరని, తనకు ఇచ్చిన కర్తవ్యాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలను విమర్శించినా అది వినేవారికి కరెక్టు అనేలా కెటిఆర్ మాటలు ఉంటాయని అన్నారు.
చెప్పేదేముంది...
లోకేష్ గురించి చెప్పేది ఏముందని పోసాని కృష్ణమురళి అన్నారు. అన్నీ మీడియా మిత్రులకు తెలిసినవేనని అన్నారు తాను ఇబ్బంది పడడం తప్ప కొత్తగా చెప్పడం వల్ల వచ్చేది ఏమీ లేదని అన్నారు. ఒకటి మాత్రం చెప్పగలను, కష్టపడితేనే మనకు గుర్తింపు అని అన్నారు మనం పడే ప్రతి కష్టం ఓటర్లు గుర్తు పెట్టుకుంటారని అన్నారు.
ఎవరూ పరిపూర్ణుడు కారు...
పరిపూర్ణుడు కాడు.. ఈ ప్రభుత్వంలోనైనా చిన్నచిన్న పొరపాట్లు ఉంటాయని కెసిఆర్ పాలన గురించి పోసాని అన్నారు. ఇన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు చిన్నచిన్న తప్పులను పట్టించుకోవద్దని, కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలు చాలా మెచ్చుకోదగినవని అన్నారు. గతంలో కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియకపోయేదని, ఇప్పుడు అలా కాదని అన్నారు.