ప్రత్యూషను కంటికి రెప్పలా చూసుకుంటా, ఆ సవతి తల్లి ఒక ఆడదేనా: పోసాని
తండ్రి, సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురై, గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 19ఏళ్ల ప్రత్యూషకు అన్నీ తానై చూసుకుంటానని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ముందుకొచ్చారు. ప్రత్యూషను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినప్పటి నుంచి పెళ్లయ్యే వరకు అన్ని ఖర్చులు తానే భరిస్తానని చెప్పారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యూష బీఎస్సీ చదవాలనుకుంటుందని తెలిసిందని, ఆ బీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగం వచ్చిన తర్వాత పోసానిగారు ఇక మీ సాయం చాలు అనేంత వరకు తనని కంటికి రెప్పలా చూసుకుంటానని అన్నారు.
ప్రత్యూష ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆదుకుంటామని ఎవరూ ముందుకు రాకపోవడం, తనను అమితంగా కలిచివేసిందని చెప్పారు. ప్రత్యూష ఘటన వివరాలు తెలిసిన తర్వాత ఎంత చలించిపోయానో, ఎంతగా ఏడ్చానో తనకు, తన భార్యకు మాత్రమే తెలుసునని అన్నారు.
సాధారణంగా ఇలాంటి ఘటనలు టీవీలో చూస్తున్నప్పుడు మనకెందుకులే అని ఛానెల్ మార్చి వేరే ప్రోగ్రాం చూస్తామని అన్నారు. ప్రత్యూష ఘటన విషయంలో ఇంతగా చలించిపోడానికి గల కారణాన్ని కూడా పోసాని వెల్లడించారు. తాము కూడా ఒకప్పుడు బాగా బతికామని, ఆస్తులన్నీ కరిగి పోవడంతో తన తండ్రి ఆర్ధిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.
తండ్రి మరణం తర్వాత దొంగనో రౌడినో కావాల్సిన నేను పరుచూరి బ్రదర్స్ దయతో ఇంతటి వాడినయ్యానని చెప్పారు. అప్పటి నుంచి ఇబ్బందులు పడేవారిని చూస్తే తన గుండె తరుక్కుపోతుందని, వెంటనే స్పందిస్తానని చెప్పారు. ప్రత్యూష కేసు విషయంలో తీర్పు ఇచ్చే అవకాశం వస్తే ఆ తండ్రికి, సవతి తల్లికి ఉరిశిక్ష వేసి, అదే రోజు అమలు చేయాలని చెప్తానని అన్నారు.
ప్రత్యూషను అంతగా చిత్రహింసలకు గురి చేసిన ఆ సవతి తల్లి ఒక ఆడదేనా అని ప్రశ్నించారు. ప్రత్యూష కేసును విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం ప్రత్యూష ఆస్తుల వివరాలను ఆరా తీశారు. ఈ నెల 20వ తేదీన ప్రత్యూష మేనమామను, తండ్రిని కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు.