తెలంగాణ ఎన్నికలకు 4 గంటల ముందు పోసాని దేవుడికి ఏమని మొక్కాడో తెలుసా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస గెలవడంపై ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి బుధవారం స్పందించారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ గెలుస్తాడా, మహాకూటమి గెలుస్తుందా అని తనను చాలామంది అడిగారని, ప్రజల్లో నీతి, నిజాయితీ, మేలు చేసిన వాడికి మంచి చేయాలనే విలువలు ఉంటే కేసీఆర్ గెలుస్తారని సమాధానం చెప్పానని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018లో గెలిచిన అభ్యర్థులు (ఫోటోలు)
ఏపీ నుంచి సైంధవుడిలా చంద్రబాబు
ఏపీ నుంచి సైంధవుడిలా డబ్బు సంచులు తీసుకుని చంద్రబాబు వచ్చారని, అయినప్పటికీ ప్రజలు కేసీఆర్ను మాత్రమే నమ్మారని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు తిమ్మిని బమ్మిని చేయగలరన్నారు. ఆయన తెలంగాణలో అడుగుపెట్టగానే తాను కూడా కొంచెం భయాందోళనకు గురయ్యానని వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ను గెలిపించారన్నారు.
చంద్రబాబు వచ్చాక కేసీఆర్ ఓడిపోతారని భయపడ్డాను
కేసీఆర్ కూడా ఓడిపోతారని రెండో సైంధవుడు విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా చెప్పారని పోసాని గుర్తు చేశారు. ఒక బక్కవాడిని కొట్టడానికి ఇంతమంది వచ్చారన్నారు. తాను ఎంతో ప్రేమించే గద్దర్ కూడా కూటమిలోకి రావడంతో తాను షాక్కు గురయ్యానని చెప్పారు. తన జీవితంలో కేసీఆర్ను దగ్గర నుంచి కూడా చూడలేదని, కానీ, ఆయన చేసిన మంచి పనులు ఆయనను అభిమానించేలా చేశాయన్నారు.
అదే మొక్కుకున్నాను
2009లో సినిమా పరిశ్రమ నుంచి తనకు మాత్రమే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరఫున టిక్కెట్ ఇచ్చారని పోసాని గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ తాను ఎమ్మెల్యేను కావాలని దేవుడిని కోరుకోలేదని, కానీ ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని మొదటిసారి దేవుడిని కోరుకున్నానని, ఎన్నికలకు నాలుగు గంటల ముందు కూడా మొక్కుకున్నానని చెప్పారు. కేసీఆర్ గెలిచినందుకు ఉదయం గుడికి వెళ్లి వచ్చానని చెప్పారు. తెలంగాణ ప్రజలది చాలా గొప్ప మనస్తత్వమన్నారు.
ఎన్టీఆర్నే చంపాడు.. బక్కవాడు ఎంత అనుకున్నా కానీ
ఎన్టీఆర్నే చంపిన వాడికి, ఒక బక్కవాడు (కేసీఆర్) ఎంత అని తాను అనుకున్నానని, కేసీఆర్ ఓడిపోతారేమోనని భావించానని పోసాని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే సగం తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలు గొప్ప ప్రాజెక్టులు అని చెప్పారు. షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి మంచి ఆలోచనలు అన్నారు.