దుబ్బాకలో దుమ్మురేపుతున్న కాంగ్రెస్!జోరుగా సన్నాహక సమావేశాలు.!గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న ఉత్తమ్
హైదరాబాద్ : దుబ్బాక ఉప పోరులో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. ఉప ఎన్నికలలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు, ఎంపి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దుబ్బాక నియోజక వర్గం ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పకడ్బందీ వ్యూహంతో ప్రచారం నిర్వహిస్తుంది. ఉప ఎన్నికల విషయంలో మొదటి నుంచి ప్రణాళిక బద్దంగా ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ రోజు రోజుకు ప్రచారంలో పరుగులు పెడుతున్నట్టు తెలుస్తోంది. స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి కొడుకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ లో చేర్చుకొని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టడంతో నియోజక వర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
Recommended Video
దుబ్బాకలో పకడ్బందీ వ్యూహంతో కాంగ్రెస్ ప్రచారం.. టీమ్ వర్క్ తో దూసుకుపోతున్న కాంగ్రెస్
ప్రస్తుతం రెండు రోజుల నుంచి ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రామాల వారీగా, బూత్ ల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ ఇంచార్జి నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. సోమ, మంగళవారాలలో చేగుంట, నార్సింగి, దౌల్తాబాద్, రాయపోల్, గజ్వెల్, తొగుట, మిర్దోడ్డి, దుబ్బాక మండలాల వారీగా సమీక్షలు చేశారు. ప్రతి బూత్ నుంచి 30 మంది గ్రామ నాయకులను ఎంపిక చేసి ఎన్నికలు పూర్తయ్యే వరకు నియోజక వర్గ ప్రజలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రణాళిక రచిస్తున్నారు కాంగ్రెస్ ముఖ్య నేతలు.
నియోజక వర్గంలో బూత్ ల వారీగా సమీక్షలు.. బూత్ కు 30 మంది గ్రామ నాయకులతో ప్రచారం..
ఇప్పటికే రాష్ట్రంలోని ముఖ్య నాయకులను గ్రామ, మండల, బూత్ ఇంఛార్జీలుగా టీపీసిసి నియమించిన విషయం తెలిసిందే. గ్రామాల్లో మకాం వేసిన నాయకులు కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసే దిశగా పకడ్బందీగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం నాడు జరిగిన నామినేషన్ కార్యక్రమంలో భారీ జన సమీకరణ చేసి కాంగ్రెస్ నియోజకవర్గంలో తన సత్తా చాటుకుంది. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కి నియోజక వర్గంలో ఉన్న పలుకుబడి ఉపయోగించుకొని, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేస్తూ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా దూసుకుపోతుంది.
గ్రామాల్లో మకాం వేసిన నేతలు.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న మనిక్కం ఠాగూర్..
ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షులు అన్ని మండలాలు తిరిగి ఆయా మండలాల సమావేశాలు నిర్వహించి ఇంచార్జి లకు సలహాలు, సూచనలు ఇస్తూ ప్రచార కార్యక్రమాలు వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుటుంబ పాలన అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ప్రజలనుంచి సానుకూలమైన స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయాల్లోనే కాకుండా అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు కావాలని, చంద్రశేఖర్ రావుకు తల ఊపే మరో ఎమ్యెల్యే ఉంటే ఉపయోగం ఉండదనే దిశగా కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.
దుబ్బాకలో టిఆర్ఎస్ కు భారీ ఓటమి.. కాంగ్రెస్ గెలుపుపట్ల ధీమా వ్యక్తం చేసిన ఉత్తమ్..
అంతే కాకుండా మంగళవారం నాడు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తోగుట మండలం, మిర్డోడి మండలం మరియు దుబ్బక మండలం మరియు దుబ్బాక పట్టణంలో వేర్వేరు సమావేశాలలో ప్రసంగించారు. ప్రజలకు.ఇచ్చిన హామీలు అమలు చేయడంలో అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారని ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ షాక్కు గురవుతుందని ఉత్తమ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ అంతటా భారీ వర్షాలు, వరదల్లో భారీగా ప్రాణాలు, ఆస్తులు పోయాయని ఆరోపించారు. సహాయక చర్యలను పరిశీలించడానికి మరియు బాధిత ప్రజలలో విశ్వాసం కలిగించడానికి ముఖ్యమంత్రి ఒక్క బాధిత ప్రాంతాన్ని సందర్శించలేదని ఉత్తమ్ మండి పడ్డారు.