సీఎం జగన్ 203జీవో చీకటి కోణమిదే.. చంద్రబాబు చెప్పులు మోసింది కేసీఆరే.. రోజా రాగి సంగటితో బలుపు..
ఆంధ్రా-తెలంగాణ మధ్య 'పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు'పై రాజుకున్న వివాదం.. వారం వ్యవధిలోనే పెరిగి పెద్దదై, మిగతా ప్రాజెక్టులపైనా ఫిర్యాదులు చేసుకునేదాకా వెళ్లింది. అటు నీటి హక్కుల కోసం ఏపీతో న్యాయపోరాటం చేస్తూనే, ఇటు జగన్తో దోస్తానా కొనసాగిస్తానని కేసీఆర్ స్పస్టం చేశారు. తెలంగాణ సీఎం వైరుధ్య ప్రకటన వెనుక పెద్ద కుట్రే దాగుందని, ఇద్దరు సీఎంలు కలిసే దోపిడీకి తెరలేపారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
పులివెందులకే నీళ్లిచ్చాను, జగన్ అజ్ఞాని.. కేసీఆర్ మంచోడా? ఏపీని ముంచేస్తే?.. చంద్రబాబు సంచలనం..
గాంధీభవన్లో ప్రెస్మీట్
నీళ్లు, నిధులు, నియామకాల కోసం జనం తెలంగాణను సాధించుకుంటే, గద్దెమీదున్న కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం పట్టిస్తున్నాడని, పచ్చి తెలంగాణ ద్రోహి వైఎస్ జగన్తో కలిసి భారీ కుట్రకు ప్లాన్ చేశారని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ సర్కారు తెచ్చిన జీవో 203, ఇద్దరు సీఎంల నాటకం వెనుక ప్రైవేటు విద్యుత్ సంస్థల లాబీయింగ్ ఉందని చెప్పారు.
అసలు టార్గెట్ నీళ్లు కాదు.. కరెంటు..
‘‘పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచుతూ జగన్ 203 జీవో ఇచ్చాడు. దీని వల్ల దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుందని కృష్ణా బోర్డుకు కేసీఆర్ ఫిర్యాదు చేశాడు. మిగులు జలాలను మాత్రమే రాయలసీమకు తరలిస్తానన్న జగన్ వాదనను కేసీఆర్ సమర్థించాడు. ఈ వ్యాఖ్యల్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది. అంతా కలిపి 6500 మెగావాట్ల కరెంటు వస్తుంది. పోతిరెడ్డిపాడు, మచ్చుమర్రి వద్ద బొక్కలు పెట్టి జగన్ నీళ్లు తీసుకెళితే.. శ్రీశైలానికి చుక్క నీరురాదు. దాంతో మూడు మేజర్ ప్రాజెక్టుల వద్ద విద్యుత్ ఉత్పత్తి పడకేస్తుంది. వాటికి ప్రత్యామ్నాయంగా రెండు రాష్ట్రాల్లో కొత్తగా ప్రైవేటు విద్యుత్ సంస్థలు పుట్టుకొస్తాయి. అంటే జీవో 203 అసలు టార్గెట్ నీళ్లు కాదు, కరెంటే. భారీ కమిషన్ల కోసమే ఇద్దరు సీఎంలు కూడబలుక్కొని ఈ ప్లాన్ కు అంగీకరించారు. దీని వెనుక ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల లాబీయింగ్ ఉంది.. '' అని రేవంత్ వివరించారు.
విద్యుత్ ఆధారంగా వాటాలు..
కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీల నీటికి బోర్డు కేటాయించిందని, ఆయా రాష్ట్రాల్లో విద్యుత్ వినియోగం ప్రకారం.. ప్రాజెక్టుల విభజన చేయాలని దివంగత కాంగ్రెస్ జైపాల్ రెడ్డి ఆనాడు సూచించారని, ఆ మూడు ప్రాజెక్టుల్లో ఉత్పత్తి అయ్యే 54 శాతం విద్యుత్ ను తెలంగాణ వాడుకునేదని, దాని ప్రకారమే ఆయా ప్రాజెక్టుల్లోని నీటిలోనూ తెలంగాణకు వాటా ఇచ్చారని, ఇప్పుడు జగన్-కేసీఆర్ కుమ్మక్కు రాజకీయాలతో విద్యుత్ ఉత్పత్తి ప్రమాదంలో పడిందని రేవంత్ చెప్పారు.
వైఎస్కు మూటలు మోసిందెవరు?
పోతిరెడ్డిపాడుకు హారతులు పట్టారంటూ కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ చేసిన విమర్శలకు రేవంత్ ఘాటుగా బదులిచ్చారు. నాడు చంద్రబాబుకు చెప్పులు మోసింది, వైఎస్సార్ కు డబ్బు మూటలు మోసింది కూడా కేసీఆరే అని, అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా, మాగం రంగారెడ్డి ఎమ్మెల్సీ కోసం ఎమ్మెల్యేలను అమ్ముకున్న చరిత్ర కేసీఆర్దేనని దుయ్యబట్టారు. తెలంగాణ శాసన సభలో నీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ పవన్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వకుండా స్పీకర్ అడ్డుకుంటే, దాన్ని కాంగ్రెస్ పార్టీ పారిపోయినట్లుగా దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.
రోజా రాగి సంగటి..
‘‘నీళ్లు, నిధులు, నియామకాలు.. తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్ లైన్. రాష్ట్రం వచ్చి ఆరేళ్లయింది. కేసీఆర్.. నీళ్లను జగన్కు, నిధులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు, నియమకాలను సొంతకుటుంబీకులకు పంచేశాడు. వైసీపీ ఎమ్మెల్యే రోగా పెట్టిన రాగి సంగటి తిని కేసీఆర్ బలిసి మాట్లాడుతున్నాడు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే విద్యుత్ ప్రాజెక్టులు చనిపోతాయి. ఇది అపర మేధావి కేసీఆర్, బాల మేధావి కేటీఆర్ కు తట్టడం లేదా? ''అని రేవంత్ ప్రశ్నించారు.
Recommended Video
జూన్ 2న నిరసన..
ఏపీ పాలకులతో కలిసి సీఎం కేసీఆర్ తెలంగాణకు చేస్తోన్న అన్యాయాన్ని నిరసిస్తూ, రాష్ట్ర ఆవిర్భావదినోత్సవమైన జూన్ 2న.. అన్ని ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపడతారని ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. పోతిరెడ్డిపాడు విస్తరణ ముసుగులో రెండు రాష్ట్రాల ప్రజలపై పెద్ద కుట్ర జరుగుతున్నదని, ఇంత ప్రమాదకరమైన అంశంపై విద్యుత్ రంగ నిపుణులు బయటకు వచ్చి మాట్లాడాలని ఆయన కోరారు.