దారుణం ..ప్రేయసిపై కిరోసిన్ పోసి నిప్పంటించి .. భయంతో తానూ ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఒక్కటిగా బతుకుతామని సహజీవనం చేసిన లవర్స్ సజీవ దహనం అయ్యారు . సామాజిక కట్టుబాట్లను తుంగలో తొక్కి ప్రేమ కోసం అంటూ పెళ్లి కాకుండానే ఒక్కటిగా సహజీవనం చేస్తున్న జంట మధ్య చెలరేగిన ఘర్షణ చివరికి వారి ప్రాణాలు తీసింది.
పెళ్లి కాకుండానేఆ ప్రేమికుల సహజీవనం
ఈ దారుణ సంఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే కొత్తగూడెం జిల్లాకు చెందిన వినోద్, తేజస్విని లు గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఎప్పటికైనా పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలని భావిస్తున్న వీరు పెళ్లికిముందే సహజీవనం చేస్తున్నారు. ఒకరిని విడిచి మరొకరు వుండలేక పెళ్లి కాకుండానే ఒకే ఇంట్లో వుంటూ సహజీవనం చేస్తున్నారు. చంచుపల్లి మండల కేంద్రంలో ఓ గదిని అద్దెకు తీసుకుని భార్యాభర్తల మాదిరిగానే కలిసుంటున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య చెలరేగిన గొడవ ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది.
తరచూ ఘర్షణలు.. ఆవేశంలో కిరోసిన పోసి తగలబెట్టిన ప్రియుడు , తాను సైతం ఆత్మహత్య
పెళ్లి కాని వీరి సహజీవన కాపురంలో తరచూ చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి . అయితే ఇవి ఈ మధ్య కాలంలో మరీ తీవ్రమయ్యాయి. వారి మధ్య ప్రేమ కాస్తా ద్వేషంగా మారింది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ప్రేమికులిద్దరు గొడవపడ్డారు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన వినోద్ విచక్షణను కోల్పోయి ప్రియురాలిపై కిరోసిన పోసి నిప్పంటించాడు. ఆమె కేకలు వేస్తూ తగలబడుతుండటంతో ఏం చెయ్యాలో అర్ధం కాని స్థితిలో వినోద్ సైతం భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఇద్దరూ సజీవ దహనం అయ్యారు.
ఇద్దరూ మృతి ...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఈ విషయాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.