తెలంగాణకు బకాయి దెబ్బ: ఏపీ నుంచి 'పవర్' కట్, ఈరోజే ఆపేస్తారా!?
సింగరేణి కాలరీస్ కు ఇవ్వాల్సిన మొత్తం కింద రూ.1,360కోట్లను తెలంగాణ డిస్కలం నుంచి సర్దుబాటు చేస్తామని అధికారికంగా తెలిపినప్పటికీ..
అమరావతి: పెండింగ్ బకాయిలు చెల్లించనందునా.. మే 31వ తేదీ నుంచి విద్యుత్ నిలిపివేస్తామని తెలంగాణకు ఏపీ జెన్కో నుంచి ఇదివరకే నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. బకాయిల చెల్లింపుపై ఎలాంటి స్పందన లేకపోవడంతో విద్యుత్ నిలిపివేయడానికే ఏపీ జెన్ కో నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో.. ఏ క్షణంలోనైనా తెలంగాణకు ఏపీ విద్యుత్ నిలిపివేసే అవకాశముంది. బకాయిలు చెల్లించేవరకు విద్యుత్ నిలిపివేయాలంటూ సదరన్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఆర్ఎస్ డీసీ), ఏపీ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఏపీఎల్ డీసీ)కి బుధవారం ఏపీ జెన్ కో ఎండీ అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు గ్రిడ్ డిమాండ్కు అనుకూలంగా షెడ్యూలింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తవడానికి మరికొన్ని గంటలు పడుతుంది. దీంతో గురువారం నాడు ఏ క్షణాన్నైనా విద్యుత్ నిలిపివేయవచ్చునన్న వాదన వినిపిస్తోంది. కాగా, తెలంగాణ డిస్కంల నుంచి సుమారు రూ.3,138కోట్ల బకాయిలు ఏపీ జెన్కో కు రావాల్సి ఉంది.
సింగరేణి కాలరీస్ కు ఇవ్వాల్సిన మొత్తం కింద రూ.1,360కోట్లను తెలంగాణ డిస్కలం నుంచి సర్దుబాటు చేస్తామని అధికారికంగా తెలిపినప్పటికీ.. సింగరేణి అందుకు అంగీకరించడం లేదని ఏపీ జెన్కో తమ నోటీసులో వెల్లడించింది.
ఇదిలా ఉంటే, రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ పంపిణీకి సంబంధించి కేంద్రం ఇచ్చిన ఆదేశాల ప్రకారం బొగ్గు ఆధారిత విద్యుత్ ను రెండు రాష్ట్రాలు తెలంగాణ-53.89శాతం, ఆంధ్రప్రదేశ్ 46.11శాతం కింద పంచుకోవాల్సి ఉంది. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రోజూ 1200మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతోంది. అదే సమయంలో తెలంగాణ నుంచి ఏపీకి 800మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతోంది.
తెలంగాణకు అదనంగా రోజుకు సుమారు 400మెగావాట్ల విద్యుత్ ఏపీ జెన్ కో నుంచి వెళ్తోంది. అయితే ఈ అదనపు విద్యుత్తుకు సంబంధించి తెలంగాణ డిస్కంలు సకాలంలో డబ్బు చెల్లించలేదు. ఇలా బకాయిల విషయం తెరపై ఉండగానే.. తాజాగా కురుస్తున్న వర్షాలకు ఏపీలో విద్యుత్ డిమాండ్ తగ్గింది. అటు తెలంగాణలోను కొంత విద్యుత్ ఉత్పత్తి డిమాండ్ తగ్గుతుంది. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ జెన్ కో థర్మల్ ప్లాంట్లలో ఎంత మేర ఉత్పత్తిని తగ్గించాలనే విషయంలో అధికారులు ఆలోచనలో పడ్డారు.