కస్టమర్ చార్జీల వాత.. ఈ నెలలో రూ.88 కోట్లు టార్గెట్.. రంగంలో ట్రాన్స్ కో సిబ్బంది..
రైతు సంక్షేమం.. అన్నదాతల మేలు కోసం పలు పథకాలు ప్రవేశపెట్టామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఉచిత విద్యుత్ ఇస్తున్నామని.. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదని పలుమార్లు చెప్పింది. అయితే కస్టమర్ చార్జీ పేరుతో రైతు నుంచి ముక్కుపిండీ మరీ డబ్బులు వసూల్ చేస్తోంది. దీనిపై రైతు నేతలు, సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోన్న పట్టించుకోవడం లేదు.
కస్టమర్ చార్జీల వాత..
కస్టమర్ చార్జీల పేరుతో ప్రతి రైతు నుంచి ట్రాన్స్ కో రూ.360 వసూలు చేస్తోంది. ఈ నెల చివరి వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.88 కోట్లు రాబట్టాలనే టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం సిబ్బందిని కూడా రంగంలోకి దింపింది. రైతుల ఇళ్లకు సిబ్బంది వచ్చి కరెంట్ బిల్లులు చేతిలో పెట్టి కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. రైతులు మాత్రం వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ అని చెప్పి, ఇప్పుడు కొత్తగా కస్టమర్ చార్జీలు ఎంటీ అని అడుగుతున్నారు. తాము అమ్మిన వడ్ల పైసలే ఇంకా రాలేదని, ఇప్పటికిప్పుడు బిల్లులు ఎలా కడ్తామని ప్రశ్నిస్తున్నారు..
24.4 లక్షల విద్యుత్ కనెక్షన్లు
రాష్ట్రంలో 24.4 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. రైతుల వ్యవసాయానికి ఫ్రీ కరెంట్అందజేస్తోంది. అయితే ట్రాన్స్ కో ప్రతి కనెక్షన్కు నెలనెలా రూ.30 చొప్పున కస్టమర్ చార్జీలు వసూలు చేస్తోంది. చాలామంది రైతులకు ఈ విషయం తెలియదు. దీంతో వారు చెల్లించ లేదు. డిసెంబర్ కావడంతో ఒక్కో కనెక్షన్ బకాయి రూ.360 కు చేరాయి. మొత్తం కనెక్షన్లను బట్టి చూసినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రూ.88 కోట్ల బకాయి ఉంది. ఈ మొత్తాన్ని రాబట్టాలని భావిస్తున్న ట్రాన్స్కో.. సిబ్బందిని రంగంలోకి దింపారు.
ఇదే సమయం..
పంటలు చేతికి రావడంతో బిల్లుల వసూళ్లకు ఇదే మంచి సమయమని ట్రాన్స్ కో భావించింది. ట్రాన్స్కో ఉద్యోగులు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతున్నారు. కొన్ని చోట్ల వ్యవసాయ కనెక్షన్ కింద పైసలు తీసుకొని ప్రత్యేక రసీదులు ఇస్తున్నారు. యాసంగి పెట్టుబడికే డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే కస్టమర్చార్జీ కట్టమనడం న్యాయం కాదని రైతులు అంటున్నారు. చిన్న, పెద్ద రైతులందరికీ ఒకే తరహా చార్జీ వసూలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. చిన్న రైతులు 3హెచ్పీ మోటర్లు వాడుతుంటే కాస్త భూమి ఎక్కువగా ఉన్న రైతులు 5హెచ్పీ మోటర్లు వాడుతున్నారు.
కస్టమర్ చార్జీలు వద్దు..?
వర్షాలు, చీడపీడల వల్ల దిగుబడి దెబ్బతిన్నందున కస్టమర్ చార్జీలు పూర్తిగా రద్దు చేయాలని రైతుసంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వానాకాలంలో రైతులు భారీవర్షాలు, వరదల కారణంగా ఎంతో నష్టపోయారని రైతు నేతలు అంటున్నారు. సీఎం మాటలు నమ్మి సన్నవడ్లు పెట్టిన రైతులు ఆగమయి పోయారని చెప్పారు.