లాక్ డౌన్: ఈ నెల కరెంట్ బిల్లు వచ్చిందా? ఎంత కట్టాలో చెప్పిన విద్యుత్ మంత్రి
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్న కారణంగా గృహ, పారిశ్రామిక వినియోగాలపై కరెంట్ బిల్లులు జనరేట్ కాలేదు. రీడింగ్ తీయకూడదన్న డిస్కంల ఆదేశాల మేరకు అంతటా ఇదే పరిస్థితి. తెలంగాణలో విద్యుత్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి మంత్రి జగదీశ్వర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ట్రాన్స్ కో, జెన్కో చైర్మన్ ప్రభాకర్ రావు సహా ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు.
గతేడాది మార్చి బిల్లే..
లాక్ డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైపోయిన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, 24 గంటలు నాణ్యమైన విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ తీవ్రంగా శ్రమిస్తున్నదని, ఆపరేటర్ నుంచి సీఎండీ వరకు ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. వైరస్ వ్యాప్తి భయాల నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది ఇళ్లకు వెళ్లి మీటర్ రీడింగ్ తీసే అవకాశం లేదుకాబట్టి, 2019 మార్చి నెలలో ఎంతైతే బిల్లు చెల్లించారో.. అంతే మొత్తాన్ని 2020 మార్చి నెలలోనూ చెల్లిస్తే సరిపోతుందని, అది కూడా ఆన్ లైన్ విధానంలో చెల్లించాలని మంత్రి తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే ఇళ్లకు బిల్లులు కూడా పంపామన్నారు.
అనుమానాలు వద్దు..
గతేడాది కంటే ఈసారి బిల్లు ఎక్కువ తక్కువ వస్తుందేమోననే ప్రజలు అనుమాన పడాల్సిన అవసరం లేదని, నిజానికి గతేడాది మార్చితో పోల్చుకుంటే.. ఈ ఏడాది మార్చిలో ప్రజలంతా ఇళ్లలోనే ఉన్నారు కాబట్టి విద్యుత్ వినియోగం కూడా 15 నుంచి 20 శాతం ఎక్కువగానే ఉంటుందని, దాన్ని బట్టి అదనంగా డబ్బులు చెల్లించడంలేదన్న విషయాన్ని అందరూ గుర్తించాలని మంత్రి చెప్పారు. ఈ విధానంలో చెల్లింపులకు ఈఆర్సీ కూడా ఆమోదం తెలిపిందన్నారు. మిగతా రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానంలోనే తాము కూడా ఈ బిల్ ఇస్తున్నామన్నారు.
లాక్ డౌన్ తర్వాత..
కాగా, కరోనా లాక్ డౌన్ ముగిసిన వెంటనే, అన్ని మీటర్ల రీడింగ్ ను తీసి.. ఇప్పటికే కట్టిన డబ్బును మినహాయించి, మిగతా బిల్లును రెండు విడతల్లో చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు మంత్రి చెప్పారు. లాక్ డౌన్ కారణంగా విద్యుత్ బిల్లుల వసూళ్లలో తీవ్ర జాప్యం ఏర్పడిందని, లో టెన్షన్(ఎల్టీ) కనెక్షన్లకు సంబంధించి రూ.623 కోట్లు బకాయిలు ఉండగా, కేవలం రూ.45 కోట్లే వచ్చాయని, హైటెన్షన్(హెచ్టీ) కనెక్షన్లకు సంబంధించి రూ.1390 కోట్లకుగానూ రూ.459 కోట్లే వచ్చాయని , ఇక డొమెస్టిక్ బిల్లులు రూ.203కోట్లుకాగా, ఇప్పటి వరకు రూ.7.27 కోట్లు మాత్రమే వసూలయ్యాయని, ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా వెంటనే ఆన్ లైన్ విధానంలో బిల్లులు చెల్లించాలని మంత్రి కోరారు.
Recommended Video
తగ్గిన డిమాండ్..
విశ్వనగరం హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని జిల్లాలు కలుపుకొని గతేడాది మార్చిలో 8900 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండిందని, దానికంటే ఈ ఏడాది వేసవిలో 13500మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని అచనాలు వేసినప్పటికీ, అనూహ్యంగా కరోనా వైరస్ వ్యాపించడంతో డిమాండ్ పడిపోయిందని, ప్రస్తుతం 7600 మెగావాట్ల డిమాండ్ ఉందని మంత్రి చెప్పారు. డిమాండ్ తగ్గడం వల్ల 1000 మెగావాట్ల గ్యాప్ ఏర్పడటంతో.. బయటి సంస్థలతో చేసుకున్న కొనుగోలు ఒప్పందాలను సవరించుకుంటున్నట్లు జగదీశ్ రెడ్డి తెలిపారు.