ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి చివరి మాటలివే: శిరీష, ప్రభాకర్ల మృతిపై ఎన్నో అనుమానాలు
హైదరాబాద్/సిద్దిపేట: కుకునూరుపల్లిలోని పోలీస్ స్టేషన్లో ఎస్సై ప్రభాకర్ రెడ్డి బుధవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆయన ఆత్మహత్యపై పలు కథనాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లో శిరీష, కుకునూరులో ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యలపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. వీరి మృతిపై అనేక అనుమానాలున్నాయి.
భర్తకు ఫోన్ చేసి రాత్రి లేట్గా వస్తానంది: బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి
శిరీషతో పరిచయమే కారణమా?
హైదరాబాదులో బ్యూటీషియన్ శిరీషతో ప్రభాకర్ పరిచయమే ఆయన ఆత్మహత్యకు దారితీసిందంటూ కొన్ని వార్త కథనాలు వెలుగుచూశాయి. అయితే, ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. కాగా, ఆత్మహత్య చేసుకునే ముందు ప్రభాకర్ రెడ్డి తన స్నేహితులతో చివరిసారిగా మాట్లాడిన మాటలు ఇప్పుడు వెలుగుచూశాయి.
బదిలీ చేయించుకుంటానంటూ..
‘నేను కుకునూర్పల్లిలో పనిచేయలేకపోతున్నాను. హైదరాబాద్ కు బదిలీ చేయించుకుంటాను' అని స్నేహితులతో ప్రభాకర్ రెడ్డి చివరిసారిగా చెప్పినట్టు తెలుస్తోంది.
హత్యా? ఆత్మహత్యా?
అధికారుల వేధింపుల వల్లే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కొంత మంది వాదిస్తుండగా, ప్రభాకర్ రెడ్డి ఫోటోల్లో కనిపిస్తున్న విధానం చూస్తుంటే...ఆయనను తుపాకీతో కాల్చి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు. కాగా, ఆయన ఆత్మహత్యతో యాదాద్రి భువనగిరి జిల్లా టంగుటూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.
హైదరాబాద్లో శిరీష మృతీ అనుమానాస్పదమే
హైదరాబాద్లో బ్యూటీషియన్ శిరీష మృతి కూడా అనుమానాస్పదంగానే ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. శ్రీకృష్ణానగర్లో నివసించే అరుమిల్లి విజయలక్ష్మి(28) అలియాస్ శిరీష ఫిలింనగర్లోని ఆర్జే ఫొటోగ్రఫీలో బ్యూటీషియన్గా పని చేస్తోంది. అంతేగాక, హెచ్ఆర్ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తోంది. కాగా, సోమవారం రాత్రి 8.30గంటల ప్రాంతంలో తన భర్త సతీష్ చంద్రకు ఫోన్ చేసిన శిరీష.. రాత్రి కొంచెం ఆలస్యంగా ఇంటికి వస్తానని తెలిపింది. అయితే ఆమె ఆ రాత్రి ఇంటికి రాలేదు. ఎప్పటిలాగే సతీష్ మంగళవారం ఉదయం బేగంపేటలోని తాను కుక్గా పని చేసే ఆశ్రయ్-ఆకృతి పాఠశాలకు వెళ్లారు. ఆ తర్వాత సతీష్ చంద్రకు బంజారాహిల్స్ పోలీసులు ఫోన్ చేసి వెంటనే శిరీష పనిచేస్తున్న ఫిలింనగర్లోని ఆర్జే ఫొటోగ్రఫీ కార్యాలయానికి రావాలని చెప్పారు. దీంతో సతీష్ అక్కడి వెళ్లి చూడగా.. శిరీష విగత జీవిగా కనిపించింది. ఆర్జే ఫొటోగ్రఫీ యజమాని వల్లభనేని రాజీవ్ను పోలీసులు ప్రశ్నించగా.. రాత్రి 2గంటల ప్రాంతంలో ఫ్యాన్కు ఉరేసుకుందని, తానే చున్నీని కత్తిరించి శిరీషను మంచం మీద పడుకోబెట్టానని చెప్పాడు. అయితే, తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని మరణం వెనుక తనకు అనుమానాలున్నాయని భర్త సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.