ఆ రాత్రి క్వార్టర్లో ఏం జరిగింది? రెండు గంటలపాటు ఒకే గదిలో శిరీష, ప్రభాకర్ రెడ్డి?
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష, కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్రెడ్డి అనుమానాస్పద మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఇంకా వీడలేదు. కానీ, వారిద్దరి పరిచయం, వారి మధ్య ఏం జరిగిందనేదానిపై కొంత వరకు స్పష్టం వచ్చింది. సోమవారం అర్ధరాత్రి కుకునూర్పల్లిలో ఏం జరిగింది?.. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ చేరుకునేవరకూ దారిలో ఏం జరిగిందనే విషయాలు ఇప్పుడు కీలకంగా మారాయి.
శిరీషను చంపేశారు: భర్త సతీష్చంద్ర ఏమన్నారంటే..?
ఆ చిక్కుముడి విప్పగలిగిన ముగ్గురులో శిరీష ప్రాణాలతో లేదు. ఇక మిగిలింది రాజీవ్, శ్రవణ్లే. వీరిద్దరూ నోరు విప్పితే గానీ అసలేం జరిగిందనే విషయం బహర్గతం కాదు. అయితే, ఈలోగానే ఆ రోజు జరిగినదానిపై విభిన్న కోణాల్లో కథనాలు వినిపిస్తున్నాయి.
రాజీవ్, శిరీషల మధ్య శ్రావణ్ మధ్యవర్తిత్వం
రాజీవ్, శిరీషల మధ్య నెలకొన్న వివాదం తేల్చడానికి శ్రవణ్ సోమవారం హైదరాబాద్ వచ్చాడు. ముగ్గురూ కలిసి మద్యం తాగుతూ మాట్లాడుకున్నారు. సమస్య ఎంతకూ తెగకపోవడంతో మద్యం మత్తులోనే కారులో కుకునూర్పల్లి బయల్దేరారు. రాత్రి ఏడు గంటలకు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయానికి అక్కడ వర్షం పడుతోంది. స్టేషన్లో కాసేపు కూర్చొని ఎస్సైతోపాటు ఆయన క్వార్టర్లోకి వెళ్లారు. వెంట మద్యం తెచ్చుకున్నారు. అక్కడున్న హోంగార్డు కిలో చికెన్ తెచ్చి నలుగురికీ వండిపెట్టాడు.
కుకునూరుపల్లి ఎస్ఐతో మద్యం తాగుతూ చర్చ
నలుగురూ కలిసి మద్యం తాగుతూ తమ వివాదంపై చర్చించుకున్నారు. భోజనాలయ్యాక శిరీష తన గోడంతా చెప్పేలోగా.. ‘మీరు ‘ఎంజాయ్' చేయడానికి రామచంద్రాపురం వెళ్లిరండి' అని ఎస్సై ప్రభాకర్రెడ్డి రాజీవ్, శ్రవణ్లను బయటకు పంపించారు.
ఆ రెండుగంటలపాటు
ఆ తర్వాత రెండు గంటలపాటు ఎస్సై, శిరీష మాత్రమే క్వార్టర్స్లో ఉన్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ, పెనుగులాట జరిగినట్లు తెలుస్తోంది. శిరీష పెద్దగా కేకలు వేయడంతో రామచంద్రాపురం వెళ్లిన శ్రవణ్, రాజీవ్లను ఎస్సై వెనక్కి పిలిపించారు. వారు రాగానే ఆమెను తొందరగా తీసుకెళ్లండంటూ బలవంతంగా కారులో ఎక్కించి పంపించేశారు.
కారులో వెళుతుండగా శిరీషపై దాడి..
కారులో వెళుతుండగా శిరీషను రాజీవ్, శ్రావణ్లు కొట్టినట్లు సమాచారం. శిరీష, రాజీవ్, శ్రావణ్ వచ్చినప్పటి సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్లో లేనట్లు తెలుస్తోంది. ఆ ఫుటేజ్ను ఉన్నతాధికారులు తీసేయించారనే ఆరోపణలున్నాయి. ఫుటేజ్ గురించి ప్రశ్నించగా, భారీవర్షంలో సీసీకెమెరాలు పనిచేయవని పోలీసులు చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది.
శిరీష, రాజీవ్లను ప్రభాకర్ పిలిచారా?
ఇది ఇలా ఉండగా, మరో కథనం ఇలావుంది.. శిరీషపై రాజీవ్ ప్రేయసి బంజారాహిల్స్ పీఎస్ కు వెళ్లగా.. శ్రవణ్ విజ్ఞప్తి మేరకు ప్రభాకర్ రెడ్డి ఆ కేసు విషయంలో జోక్యం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎస్సై హరీందర్కు ఫోన్ చేసి ‘బయట సెటిల్ చేసుకుంటారు వదిలేయండి' అని కోరారు. ఈమేరకు వారిని పోలీసులు బయటకు పంపారు. అనంతరం రాజీవ్, శ్రవణ్, శిరీష కలిసి బంజారాహిల్స్లోని ఒక హుక్కా సెంటర్కు వెళ్లినట్లు సమాచారం. కేసు లేకుండా చేసినందుకు ప్రభాకర్రెడ్డికి శ్రవణ్ ఫోన్లో కృతజ్ఞతలు తెలిపారు. దానికి ఎస్సై.. తన దగ్గరకు వస్తే అందరం కూర్చొని మాట్లాడుకోవచ్చని వారిని ఆహ్వానించారు. దీంతో వారు ముగ్గురూ కుకునూర్పల్లి వెళ్లారు.
శిరీషపై దాడి
తనవద్దకు వచ్చాక.. ముగ్గురి(శిరీష, రాజీవ్, శ్రవణ్)కీ ఎస్సై మందు, విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం. కాగా, కుకునూరుపల్లిలో నలుగురూ తమ గొడవపై చర్చించుకుంటుండగా.. రాజీవ్ రెండుసార్లు శిరీషను గట్టిగా కొట్టాడని తెలుస్తోంది. ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఎస్సై ప్రభాకర్ రెడ్డి వారిని వెళ్లిపొమ్మన్నారు.
స్టూడియోకు వచ్చిన తర్వాత కూడా..
తర్వాత హైదరాబాద్కు వచ్చేటప్పుడూ కారులో రాజీవ్ శిరీషపై పలుమార్లు దాడిచేసి తీవ్రంగా కొట్టినట్టు సమాచారం. స్టూడియోలో సైతం మరోసారి కొట్టినట్టు తెలుస్తోంది. ఆమెను ఎందుకు అంతగా కొట్టాల్సి వచ్చిందన్న ప్రశ్నకు.. మద్యం మత్తులో ఎస్సై శిరీషను లొంగదీసుకొనే ప్రయత్నంలో బాగా గొడవ జరిగిందని వారు పోలీసులకు తెలిపినట్టు సమాచారం.
అన్నీ తెలస్తున్నా.. మిస్టరీగానే...
శిరీష ఆత్మహత్య తర్వాత.. రాజీవ్, శ్రవణ్లను అదుపులోకి తీసుకోవడం, వారి విచారణ గురించి ప్రభాకర్రెడ్డి బంజారాహిల్స్ పీఎస్ నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకున్నట్లు సమాచారం. అయితే, శిరీష్ ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలిసి ఎస్ఐ ప్రభాకర్ ఆందోళన చెందినట్లు సమాచారం. కానీ, ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమైతే కనిపించడం లేదు. శిరీష వ్యవహారంలో ఆయన్ను ప్రశ్నించినా.. వారు తన సలహా కోసం వచ్చారని సమాధానం ఇస్తే సరియేది. కానీ, ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసులో అసలు ఏం జరిగిందనే విషయం తేలడం లేదు. రాజీవ్, శ్రవణ్లు జరిగింది జరిగినట్లుగా చెబితే గానీ, ఈ కేసులో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదు.