ప్రగతి నివేదన సభలో కీలక ప్రకటన: కేటీఆర్, కేసీఆర్ 'సంచలన' నిర్ణయంపై సస్పెన్స్
Recommended Video
హైదరాబాద్: కొంగరకలాన్లో జరగనున్న ప్రగతి నివేదన సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. దాదాపు 25 లక్షల మంది హాజరయ్యే అవకాశముంది. తెలంగాణలో ముందస్తు ప్రచారం సాగుతోన్న నేపథ్యంలో, టీఆర్ఎస్ అడుగులు కూడా అలాగే ఉండటంతో కేసీఆర్ ప్రగతి నివేదన సభలో కీలక ప్రకటన చేసే అవకాశముందని చెబుతున్నారు. అలాగే, పలు కీలక నిర్ణయాలు.. అంటే ఎన్నికలకు ముందు పలు వర్గాలకు తాయిలాలు వంటి ప్రకటన చేసే అవకాశముందని చెబుతున్నారు. కేసీఆర్ గంటన్నర సేపు ప్రసంగించనున్నారు.
నాలుగున్నరేళ్లలో సాధించిన ప్రగతిని చాటుతూ కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని ఈ సభ ద్వారా పూరించారు. కేసీఆర్ వివిధ వర్గాల వారికి వరాలు సహా పలు కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు. సభను విజయవంతం చేయడం కోసం ప్రతిరోజూ మంత్రులతో, ఇతర నిర్వాహక కమిటీలతో సీఎం స్వయంగా మాట్లాడి సన్నాహాలు చేయించారు. పార్టీ చరిత్రలోనే గాక దేశంలోనే అత్యంత విజయవంతమైన సభగా దీనిని జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ సభ, దాని పర్యవసానాలపై అంతా ఆసక్తి నెలకొని ఉంది.
రెండో ప్రగతి నివేదన సభ
కేసీఆర్ ప్రధాన ప్రసంగం చేస్తారు. ఈ నాలుగున్నరేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తారు. 51 నెలల పాలనలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించనున్నారు. ఆదాయ పరిమితి పెంపు, ఆసరా పథకాలు, విద్యుత్ ఉద్యోగులకు తాజాగా పీఆర్సీ పెంపు వంటివి ఇందులో ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, ఉద్యోగ నియామకాలు ఇతర అంశాలను ఇందులో ప్రస్తావిస్తారు. గత ఏడాది వరంగల్లో తొలి ప్రగతి నివేదన సభ పెట్టారు. ఇది రెండోది.
కేసీఆర్ ఏం చెబుతారు?
అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలు.. తదితర అంశాలపై కేసీఆర్ తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారని తెలుస్తోంది. కొద్ది రోజులుగా ముందస్తు ఎన్నికల సంకేతాలతో దీనికి రాజకీయ ప్రాధాన్యం కూడా ఏర్పడింది. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ వందకు పైగా స్థానాలు గెలవబోతోందని సభాముఖంగా మరోసారి ప్రకటించి పార్టీ శ్రేణుల్లో సీఎం కేసీఆర్ విశ్వాసాన్ని నింపబోతున్నారు. రాష్ట్రంలో రాజకీయంగా తమకు తిరుగులేదని, తమ దరిదాపుల్లోకి రాలేని స్థితిలో విపక్షాలు ఉన్నాయని ఈ సభ ద్వారా సంకేతాలిస్తారు. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ ఏం చెబుతారనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.
సంచలన నిర్ణయం వైపే కేసీఆర్ మొగ్గు?'
అసెంబ్లీని రద్దు చేయాలనే సంచలన నిర్ణయం వైపే కేసీఆర్ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఊహించని ప్రకటనలు చేస్తారని అంటున్నారు. అప్పుడు ముందస్తు రావొచ్చునని చెబతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కేసీఆర్ ఈ సభలో కీలమైన ప్రకటనలు చేస్తారని, ఈ ప్రకటనతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుందని మంత్రి కేటీఆర్ ఓ ఆంగ్ల ఛానల్తో చెప్పారు.
తడిసిముద్దయిన సభా ప్రాంగణం
ఇదిలా ఉండగా, శనివారం రాత్రి వర్షం కురిసింది. సభా ప్రాంగణం తడిచి ముద్దయింది. మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోయాయి. సాయంత్రం వేళలో వాతావరణం చల్లబడింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సభ ఆవరణంతా చిత్తడిగా మారింది. సభలో ప్రజలు కూర్చునేందుకు వేసిన కార్పెట్లు తడిచిపోయాయి. దిగువ భాగంలో ఉన్న కార్పెట్లపైకి బురద వచ్చి చేరింది. పలు గ్యాలరీలు వర్షం నీటితో నిండిపోయాయి. ఆదివారం నిర్వహించనున్న సభకు నిర్వాహకులు కుర్చీలు వేయడంతో పాటు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. గ్యాలరీలలో సౌండ్ సిస్టంలను ఏర్పాటు చేస్తున్నారు. తెరలకు కనెక్షన్లు ఇస్తున్నారు. ఒక్కసారిగా భారీగా వర్షం రావడంతో పనులకు ఆటంకం కలిగింది. కొన్ని కటౌట్లు నేలకూలాయి.