సాఫ్ట్వేర్ శారద: కూరగాయలు అమ్ముతోంది, ఆమె ఆత్మస్థైర్యానికి ప్రముఖుల సెల్యూట్
హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కకావికలం చేసింది. అంతేగాక, అనేక వ్యాపారాలను దెబ్బతీసింది. ఎంతోమంది ఉద్యోగులను రోడ్డునపడేసింది. ఇలా ఉద్యోగం కోల్పోయిన వారిలో హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీకి చెందిన శారద అనే యువతి కూడా ఉంది. హైదరాబాద్లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే శారద.. ఇప్పుడు తన ఉద్యోగం కోల్పోయినా తన ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోలేదు.
ఏపీలో కరోనా: లక్షకు చేరువగా కేసులు - 1041 మరణాలు.. ఆ రెండు జిల్లాల్లో బీభత్సం..
సాఫ్ట్వేర్ ఉద్యోగం కోల్పోయినప్పటికీ..
ఉద్యోగం కోల్పోయినప్పటికీ అందరిలా బాధపడకుండా.. శ్రీనగర్ కాలనీలో కూరగాయలను విక్రయిస్తోంది. జాబ్ పోయిందని బాధపడటం లేదని, తప్పకుండా మళ్లీ ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉందని శారద తెలిపింది. కూరగాయల వ్యాపారం చేసేందుకు సిగ్గుపడటం లేదని, నేనేం తప్పు చేయడం లేదని, కాళ్లు చేతులు బాగున్నాయని, కూరగాయాల వ్యాపారం చేస్తూ కష్టపడుతున్నానని చెప్పింది. తన తండ్రి చేస్తున్న వ్యాపారాన్ని తాను నిర్వహిస్తున్నానని తెలిపింది. ఆత్మస్థైర్యంతో కష్టపడితే తప్పకుండా ఫలితం వస్తుందని, జీవితంలో విజయం సాధించవచ్చని చెబుతోంది.
కుటుంబకోసమేనంటూ.. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ..
కుటుంబం కోసమే శారద కూరగాయలు అమ్ముతోందని శారద తల్లి తెలిపారు. చిన్ననాటి నుంచి కష్టపడి చదివిన శారద.. వయసుపైబడిన తండ్రికి సాయంగా ఉంటోందని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన శారద ఇటీవల హైదరాబాద్లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో మంచి ప్యాకేజీకి కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యారు. మూడు నెలలపాటు ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. అంతలోనే కరోనా మహమ్మారి ప్రబలడంతో లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలో శారదతోపాటు పలువురిని ఉద్యోగంలోంచి తీసేసింది ఆ సంస్థ.
యువతకు ఆదర్శం..
కాగా, ఉద్యోగం పోయినా ఆత్మస్తైర్యం కోల్పోకుండా కూరగాయాలు అమ్ముతున్న శారద స్ఫూర్తిదాయకమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. కష్టపడి పనిచేయాలన్నది శారద ఆదర్శంగా తీసుకున్నారని, తద్వారా ఆమె యువతకు ఆదర్శంగా నిలిచారని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కొనియాడారు. శారద కష్టపడేతత్వం చూసి గర్వంగా ఉందన్నారు. ఆమె కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. శాదర కుటుంబాన్ని కలుస్తానని ఎంపీ అన్నారు.
శారదపై ప్రముఖుల ప్రశంసలు..
సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి ఇప్పుడు కూరగాయలు అమ్ముతున్న కథనం తనను ఎంతగానో కదిలించిందని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.ఆమె ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. కాగా, సాఫ్ట్వేర్ శారదపై మీడియాలో వచ్చిన కథనాలపై ఉపరాష్ట్రపతి కార్యాలయం, తెలంగాణ బీజేపీ నాయకులు, పలువురు ఎన్నారైలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం స్పందించారు. అంతేగాక, ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు పలు ఐటీ కంపెనీలు కూడా ముందుకు వచ్చాయి.