చంద్రబాబు నిస్సహాయత.. ఏమనలేం, జాగ్రత్త! పవన్ను అలా అంటే నేను నమ్మను: ప్రకాశ్ రాజ్
బెంగళూరు/హైదరాబాద్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని, 2019లోను ఢిల్లీలో అధికారం కోల్పోతుందని, నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కారని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. ఆయన గత కొంతకాలంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
'ఇలా మాట్లాడుతున్నారేంటి... పవన్ వ్యాఖ్యలతో జనసేన సభకు వెళ్లిన వాళ్లూ విస్మయం'
ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కర్నాటకలో బీజేపీ గెలుపుతో పాటు తెలుగు రాష్ట్రాలపై స్పందించారు. సీఎంలు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనా మాట్లాడారు.
చంద్రబాబు నిస్సహాయత
విభజనతో నష్టపోయిన ఏపీకి ఏదో ఒకటి చేయడానికి చంద్రబాబు చాలా కష్టపడుతున్నారని ప్రకాశ్ రాజ్ కితాబిచ్చారు. ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. దీంతో ఏపీ ప్రజలకి చాలా అన్యాయం జరిగిందన్నారు. కేంద్రం నుంచి సాయం అందకపోవడంతో చంద్రబాబు నిస్సహాయంగా ఉన్నారన్నారు.
చంద్రబాబును ఏమీ అనలేం
ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబును ఏమీ అనలేమని ప్రకాశ్ రాజ్ చెప్పారు. ఏపీ ప్రజలు ప్రత్యేక హోదాని అడుక్కోవడం లేదని, అది సాధించుకోవడం వాళ్ల హక్కు అన్నారు. కేంద్రం సాయం చేయకపోతే ఈ పరిస్థితుల్లో ఏపీ ఎలా ఎదుగుతుందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నారు.
కేసీఆర్పై ప్రకాశ్ రాజ్ ప్రశంసలు
మిషన్ భగీరథ వంటి కేసీఆర్ పథకాలు ఆకట్టుకున్నాయని ప్రకాశ్ రాజ్ చెప్పారు. తాను కేసీఆర్ బయోపిక్లో నడించడం లేదన్నారు. ప్రధాని మోడీపై ఆయన విరుచుకుపడ్డారు. ఇన్ని అబద్దాలు చెప్పే ప్రధానిని చూడలేదన్నారు. దక్షిణాదిపై బీజేపీ దృష్టి సారించిందని, కానీ తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళలో ఆ పార్టీ రాదన్నారు.
పవన్ పార్టీ పెట్టి రాజకీయాలు చేయాలనుకున్నారు
తాను ఏ పార్టీలోను లేనని ప్రకాశ్ రాజ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ మాటలో ఆవేదన ఉందని, ప్రజలకు ఏదో చేయాలనే తపన ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయాలని భావించారని, తాను పార్టీ పెట్టకుండా చేస్తున్నానని చెప్పారు. ఆయన పార్టీ పెట్టి రాజకీయాలు చేయాలనుకుంటే, నాకు పార్టీ పెట్టి రాజకీయాలు చేయాలని లేదన్నారు. పవన్ పాపులారిటీ కోసం పార్టీ పెట్టారంటే తాను నమ్మనని, ఆయనకు అప్పటికే ఎంతో పాపులారిటీ ఉందన్నారు. మంచి చేయడానికి వచ్చాడన్నారు. మంచి చేసేవారిని ముంచివేయడం చాలా సులభమని, ఆయన ఏం చేస్తారో చూడాలని అభిప్రాయపడ్డారు. పవన్ ముక్కుసూటిగా మాట్లాడుతున్నారన్నారు.
పవన్! జాగ్రత్త
పవన్ కళ్యాణ్కు ప్రకాశ్ రాజ్ కొన్ని సూచనలు చేశారు. వలస నేతలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జనాలకు మంచి చేయాలనే ఆలోచనతో ఉన్న పవన్ పార్టీ పెట్టారని, పేరు కోసం పెట్టలేదని, ఆయనకు అండగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆయనతో ఎంతమంది వస్తారు.. ఆయన ఆలోచనపరంగా ఎంతమంది వచ్చి చేరుతారు అనే విషయాలపై పవన్ జాగ్రత్తగా ఉండాలన్నారు. ముంచేసే ప్రమాదం కూడా ఉంటుందన్నారు. మంచి చేసేవాళ్లకు ఎవరికీ పోటీ కాదన్నారు.