తెలంగాణతో ప్రణబ్ ముఖర్జీకి ఎంతో అనుబంధం - బిల్లుపైనా సంతకం - సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయనను కాపాడుకునేందుకు డాక్టర్లు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్టకరమని, తెలంగాణ అంశంతో ప్రణబ్కు ఎంతో అనుబంధం ఉందని కేసీఆర్ అన్నారు. సోమవారం ప్రణబ్ కన్నుమూతపై కేసీఆర్ భావోద్వేగ ప్రకటన చేశారు.
చైనా మరో దుశ్చర్య: హిందువులకు పవిత్రమైన కైలాస మానసరోవరంలో మిస్సైల్ లాంఛర్లు - టెన్షన్
Recommended Video
తెలంగాణ ఉద్యమంలో నిజాయితీ ఉందని గట్టిగా నమ్మిన జాతీయ నేతల్లో ప్రణబ్ ముఖర్జీ ఒకరని, ఢిల్లీలోగానీ, వివిధ సందర్భాల్లోగానీ కలిసిన ప్రతిసారి ఎన్నెన్నో విలువైన సూచనలు చేసేవారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు కోసం వేసిన కమిటీకి ప్రణబ్ నాయకత్వం వహించారని, చివరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై కూడా ఆయన సంతకం చేశారని కేసీఆర్ కొనియాడారు.
ప్రణబ్ తన జీవితంలో తెలంగాణ అంశానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారనడానికి చాలా ఉదాహరణలున్నాయని, ఆయన రాసిన 'ద కొయలేషన్ ఇయర్స్' పుస్తకంలో కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ కు తెలంగాణ అంశమే ప్రధానమని, కేంద్రంలో పోర్ట్ ఫోలియోలు అక్కర్లేదనే వాక్యాన్ని ఆ పుస్తకంలో రాసినట్లు సీఎం గుర్తుచేశారు.
అర్దరాత్రి 200 మందితో చైనా చొరబాటు - కొత్త పాయింట్లే టార్గెట్ - పాంగాంగ్ సరస్సు వద్ద ఏంజరిగిందంటే
''ఒక నాయకుడు.. ప్రాంతీయ ఉద్యమాన్ని ప్రారంభించి, విజయతీరాలకు చేరడం అరుదుగా జరుగుతుంది. అలాంటి ఘనత మీకు(కేసీఆర్)కు దక్కింది'' అని ప్రణబ్ స్వయంగా తనతో అన్నారని కేసీఆర్ తన ప్రకటనలో ప్రస్తావించారు. కొన్నేళ్ల కిందట ప్రణబ్ ముఖర్జీ యాదాద్రి దేవాలయన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను అభినందించారన్న సీఎం.. నాటి ఫొటోలను కూడా షేర్ చేశారు.
ప్రణబ్ మరణం తీరని లోటని సీఎం కేసీఆర్ బాధను వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగానేకాదు.. యావత్ తెలంగాణ ప్రజల తరుఫున ప్రణబ్ కు నివాళి అర్పిస్తున్నానని, ప్రణబ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సీఎం ప్రకటనలో పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్ కు ఇటీవల బ్రెయిన్ సర్జరీ నిర్వహించిన తర్వాత కోమాలోకి వెళ్లిపోయారు. డాక్టర్లు ఎంతగా ప్రయత్నించినా ఫలితం రాలేదు. చివరికి సోమవారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు.