ప్రణయ్ హత్య: కరీంపై కాంగ్రెస్ వేటు, అమృత తల్లిపై ప్రణయ్ తల్లి తీవ్ర ఆరోపణలు
మిర్యాలగూడ: ప్రణయ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్గొండ జిల్లా మిర్యాలగూడ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షులు కరీంను బర్తరఫ్ చేస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బూడిద బిక్షమయ్య గౌడ్ సోమవారం వెల్లడించారు. ఆయన ప్రకటన జారీ చేశారు.
జస్టిస్ ఫర్ ప్రణయ్
మిర్యాలగూడలో ప్రణయ్ హత్య నేపథ్యంలో అతని భార్య అమృత ఓ ఫేస్బుక్ పేజీని క్రియేట్ చేశారు. తన తండ్రి దురహంకారం కారణంగా భర్తను పోగొట్టుకున్న అమృత న్యాయం కోసం సోషల్ మీడియా వేదికగా ఉద్యమాన్ని ప్రారంభించారు.
హత్యకు గురైన భర్త పేరుతో 'జస్టిస్ ఫర్ ప్రణయ్' పేరుతో పేజీని ప్రారంభించారు. ప్రణయ్ ఇప్పుడు ఒంటరి కాదని, తనతో పాటు కోట్ల మంది గుండెల్లో బతికే ఉన్నాడని అమృత తొలి పోస్ట్ చేశారు. మిర్యాలగూడ పట్టణంలో ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేయాలని , ఈ దిశగా అందరూ సహకరించాలని కోరారు.
అమృత తల్లిపై ప్రణయ్ తల్లి ఆరోపణలు
అమృత వర్షిణి తండ్రి మారుతీరావుతో పాటు తల్లి కూడా కలసి కుట్ర చేసి, తన బిడ్డను చంపించారని ప్రణయ్ తల్లి ప్రేమలత ఆరోపించారు. హత్యకు రెండు వారాల ముందు నుంచి అమృతకు ఆమె తల్లి ఫోన్ చేయడం ప్రారంభించిందని, మెత్తగా, నమ్మకంగా మాట్లాడి, వారి గురించి ఆరా తీశారన్నారు.
ప్రణయ్ హత్య: పాతికేళ్ల క్రితం.. అమృత తండ్రి గురించి షాకింగ్ విషయాలు! కూతురుపై ఎంత ప్రేమంటే?
నల్లపూసల గొలుసు చేయించానని, కొత్త బట్టలు పంపుతానని చెబుతూ, వారు ఎక్కడికి వెళుతున్నారన్న వివరాలను సేకరించి, తన బిడ్డను పొట్టన పెట్టుకున్నారన్నారు. అమృత అంగీకరిస్తే తీసుకు వెళ్లవచ్చునని తాము మారుతీరావుకు చెప్పామన్నారు.
తన కూతురుకు చీమ కుట్టకుండా చూసుకుని తన కొడుకును దారుణాతి దారుణంగా మారుతీరావు చంపించాడని ప్రణయ్ తండ్రి బాలస్వామి అన్నారు. ప్రణయ్, అమృత హైస్కూల్ వయసులోనే ప్రేమించుకున్నారని, తనకు విషయం తెలిసి ప్రణయ్ని పలుమార్లు కొట్టానని తండ్రి చెప్పారు. వారిద్దరూ పెళ్లి చేసుకుని వచ్చి కాళ్లపై పడి, వేడుకున్నారన్నారు.