మారుతిరావు బెయిల్ పై విడుదల: మళ్లీ జైలుకు పంపుతానంటున్న ఆయన కుమార్తె అమృత
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు తాజాగా మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతి రావు సహా, మరో ఇద్దరికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నిందతులకు బెయిల్ మంజూరు కావడంపై ప్రణయ్ భార్య, మారుతి రావు కుమార్తె అమృత అసంతృప్తిని వ్యక్తం చేశారు. వారికి బెయిల్ మంజూరు చేయడం సరికాదని అంటున్నారు. బెయిల్ రద్దు చేయించడానికి తాను న్యాయపోరాటం చేస్తానని చెబుతున్నారు. దీనితోపాటు- మారుతిరావు నుంచి తనకు, తన కుమారుడికి, అత్తామామలకు ప్రాణహాని ఉందని, వెంటనే భద్రత కల్పించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
రెండురోజులు ఆలస్యంగా విడుదల
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గత ఏడాది సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ పట్టపగలు, నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రణయ్ మామ మారుతిరావును ప్రధాన నిందితునిగా గుర్తించారు పోలీసులు. కోటి రూపాయలను సుపారీగా ఇచ్చి, కిరాయి గూండాతో ప్రణయ్ ను హత్య చేయించారనే ఆరోపణల కింద పోలీసులు మారుతిరావును అరెస్టు చేశారు. అతనితో పాటు శ్రవణ్, అబ్దుల్ లను అరెస్టు చేశారు. కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసును విచారిస్తోన్న వరంగల్ న్యాయస్థానం నిందితులకు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పత్రాలు ఆలస్యంగా అందడం వల్ల ఆదివారం వారు విడుదలయ్యారు. కొద్దిసేపటి కిందటే ముగ్గురూ వరంగల్ కేంద్ర కారాగారం నుంచి విడుదల అయ్యారు.
అంత ఈజీగా బెయిల్ ఎలా?
బెయిల్ మంజూరు కావడాన్ని అమృత తప్పు పడుతున్నారు. పట్టపగలు, నడిరోడ్డు మీద హత్య చేసిన కేసులో ప్రధాన నిందితులకు అంత సులువుగా బెయిల్ ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఒక మనిషిని బహిరంగంగా హత్య చేసినప్పటికీ.. బెయిల్ ఇవ్వడం వల్ల నిందితులకు మరింత ధైర్యం వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. బెయిల్ ఉందనే ఉద్దేశంతో ఎంత పెద్ద నేరమైన చేయవచ్చనే ధైర్యాన్ని ఇచ్చినట్టయిందని అన్నారు. దీనిపై తాను న్యాయపోరాటం చేస్తానని అంటున్నారు. బెయిల్ రద్దు చేయించేలా న్యాయ స్థానాలను ఆశ్రయిస్తానని చెప్పారు. దీన్ని చూసి, నేరం చేయాలనుకునే వారికి మరింత స్వేచ్ఛ ఇచ్చినట్టవుతుందని అమృత వ్యాఖ్యానించారు.
కుటుంబానికి ప్రాణహాని:
మారుతిరావు నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని అమృత ఆందోళన వ్యక్తం చేశారు. పట్టపగలు హత్య చేయించిన వారికి తన కుటుంబాన్ని హత మార్చడం పెద్ద కష్టమైన పని కాదని చెప్పారు. కుమార్తెననే కారణంతో- మారుతిరావు తనను ఏమీ చేయనప్పటికీ.. తన కుమారుడు, మామకు ప్రాణహాని తలపెట్టవచ్చని అమృత చెప్పారు. ప్రణయ్ హత్య కేసులో తమ కుటుంబం ప్రత్యక్షసాక్షులని అన్నారు. సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పారు. తనను బుజ్జగించి, ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తారని అమృత చెప్పారు. అయినప్పటికీ- తాను ఈ ఇళ్లు వదిలి వెళ్లబోనని స్పష్టం చేశారు.
భద్రత కోసం ఐజీని కలుస్తా:
మారుతిరావుకు బెయిల్ లభించిన నేపథ్యంలో.. తన కుటుంబానికి అతని నుంచి ప్రాణహాని ఉందని, అందుకే భద్రత కల్పించాలని తాను పోలీసులను కోరుతున్నట్లు చెప్పారు. దీనికోసం అవసరమైతే తాను ఐజీ, డీజీపీలను కూడా కలుస్తానని అన్నారు. ఇప్పటిదాకా పోలీసులు తమను కంటికి రెప్పలా కాపాడుకున్నారని అమృత తెలిపారు. హత్య చేయించిన వాళ్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, తన బిడ్డకు హాని కల్పిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టం మీద, న్యాయ వ్యవస్థ మీద తమకు నమ్మకం ఉందని, బెయిల్ రద్దు చేస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.
మారుతిరావు తండ్రి కాదు..
మారుతిరావు ఒకప్పుడు తన తండ్రి అని, ఇప్పుడు కాదని అమృత ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మారుతిరావు కుమార్తెగా కంటే ప్రణయ్ భార్యగా జీవించడంలోనే ఆనందం ఉందని చెప్పారు. జీవితాంతం ఇలాగే ఉంటానని అన్నారు. తన కుమారుడికి కూడా మారుతిరావు నుంచి ప్రాణహాని ఉందని, యుక్త వయస్సు వచ్చేంత వరకూ జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అమృత అన్నారు. వ్యక్తిగతంగా భద్రత కల్పించాలని తాను పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నానని చెప్పారు. ప్రత్యక్ష సాక్షులం అయినందున ప్రాణహాని ఉందని, తమను ప్రభావితం చేసేలా మారుతిరావు ప్రయత్నాలు చేస్తారని ప్రణయ్ తండ్రి బాలస్వామి అనుమానాలను వ్యక్తం చేశారు.