ప్రణయ్ హత్య: పాతికేళ్ల క్రితం.. అమృత తండ్రి గురించి షాకింగ్ విషయాలు! కూతురుపై ఎంత ప్రేమంటే?
మిర్యాలగూడ: ప్రణయ్ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కూతురు అమృతకు ఏం కావొద్దని, ప్రణయ్ను మాత్రమే చంపాలని ఆమె తండ్రి మారుతిరావు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. త్వరలో మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించనున్నారు.
జైల్లో చచ్చిపో.. లేదంటే చంపేస్తారు: ప్రణయ్ తమ్ముడు, వదినను చూసి కన్నీరుమున్నీరు
అమృత తండ్రి మారుతిరావు, తల్లి గిరిజారాణి. ఒక్కతే కూతురు. చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచారు. చదువులోను చురుగ్గా ఉన్నారు. కూతురుపై ప్రేమతో మారుతిరావు ఆమె చిన్నప్పుడే అమృత జీనియస్ స్కూల్ను ప్రారంభించారు. ఈ పాఠశాలను తల్లి నడుపుతున్నారు. ప్రణయ్ను చంపే సమయంలోను తన కూతురుకు ఎలాంటి హానీ తలపెట్టవద్దని వారు చెప్పారట.
లొసుగులతో వందల కోట్లు సంపాదించాడు
అమృత తండ్రి మారుతి రావు, అతని తమ్ముడు శ్రవణ్కు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉందని చెబుతున్నారు. వీరు 25 ఏళ్ల క్రితం కిరోసిన్ను అక్రమంగా అమ్మారట. అలాగే, శ్రవణ్ పైన బ్లూ ఫిలింకు సంబంధించిన కేసు కూడా ఉందట. ఆ తర్వాత భూ ఆక్రమణలతో కోట్లకు పడగెత్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మారుతి రావుది మధ్య తరగతి కుటుంబం. చట్టాల్లోని లొసుగులను ఆధారంగా చేసుకొని వందల కోట్లు సంపాదించాడని చెబుతున్నారు.
రియల్ ఎస్టేట్లో భారీ సంపాదన
మారుతి రావు తండ్రి రేషన్ డీలర్. దీంతో పౌరసరఫరాల కాంట్రాక్టర్గా ఎదిగారు. మిర్యాలగూడ నుంచి ఇతర ప్రాంతాలకు బెల్లం సరఫరా చేస్తూ కూడా సంపాదించారు. వడ్డీ వ్యాపారం కూడా చేశారు. మిర్యాలగూడలో విలువైన భూములు దక్కించుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోను బాగా సంపాదించాడు.
థియేటర్లు కొనుగోలు చేశాడు
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా డబ్బు వస్తుందని గుర్తించిన మారుతి రావు అద్దంకి - నార్కట్పల్లి మెయిన్ రోడ్డు వద్ద చాలా పెద్ద వెంచర్ ప్రారంభించారు. భూముల పంచాయతీలో మధ్యవర్తిగా ఉంటూ కూడా కొన్ని భూములు తీసుకున్నారు. తన వద్ద ఉన్న డబ్బుతో మిర్యాలగూడలో థియేటర్లు కొనుగోలు చేశారు. స్థలాలు అమ్మి, కొనడం ద్వారా పెద్ద మొత్తంలో సంపాదించారు. ఆయన అస్తుల విలువ వందల కోట్లలో ఉంటుందని చెబుతున్నారు.
శ్రవణ్ పైన పాతికేళ్ల క్రితమే సంచలన కేసు
మారుతి రావు చిన్న స్కూటర్ పైన తిరిగేవాడు. కానీ ఇప్పుడు మిర్యాలగూడలోనే తిరుగులేని కోటీశ్వరుడిగా ఎదిగారు. ఆయన రాజకీయ నాయకులను, అధికారులను పావులుగా వాడుకున్నారని చెబుతున్నారు. సెటిల్మెంట్లు, దందాలు, కబ్జాలు చేసేవాడని చెబుతున్నారు. పాతికేళ్ల క్రితం వారిది సాదాజీవితమని, వారు స్కూటర్ పైన తిరిగేవారని చెబుతున్నారు. కిరోసిన్ దందా, భూకబ్జాలు తదితరాలు చేసినట్లుగా తెలుస్తోంది. శ్రవణ్ పైన పాతికేళ్ల క్రితమే సంచలన కేసు ఉన్నదని అంటున్నారు. మిర్యాలగూడలో ఓ లాడ్జిలో నీలి చిత్రాలు తీస్తూ దొరికిపోయాడట. అతనిని అప్పుడు అరెస్ట్ కూడా చేశారట. రిటైర్డ్ అధికారి అండదండలతో ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి భూకబ్జాలకు పాల్పడ్డారని అంటారు. వారిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలతో బాగుంటారని చెబుతారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వారితో సంపాదించారని, ఆ తర్వాత తెరాసలో చేరారట.
తమిళనాడు కౌసల్య - శంకర్ హత్యతో పోలుస్తూ
ప్రణయ్ హత్యపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. గాయని చిన్మయి, నటుడు రామ్, మంచు మనోజ్ తదితరులు ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆమె తమిళనాడులోని కౌసల్య - శంకర్ల పరువు హత్యతో ప్రణయ్ హత్యను పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భారత్లో కులం పేరు చెప్పుకోకుండా ఏ రాజకీయ నాయకుడు, సినీ నటుడు సహా ఎవరూ మనలేరని, అది వ్యవస్థలో అంతర్భాగమైందని వాపోయారు. నగరాల్లో చాలామంది ఇతరుల కులం తెలుసుకోవాలనుకుంటుంటారని, కులాన్ని అడ్డు పెట్టుకొని పెద్ద పెద్ద కేసుల నుంచి చాలా మంది బయటపడుతున్నారని పేర్కొన్నారు.
భయంకరమైన నిజం
కులం పేరుతో అణచివేయడమనేది ఈ దేశంలో భయంకరమైన నిజమని అన్నారు. పెద్ద కులస్థుల బావిలో నీళ్లు తాగారని బడుగుల పిల్లలను చావగొట్టిన సంఘటనలున్నాయని, నీళ్లకు, మట్టికి కులం సర్టిఫికేట్ ఇవ్వడంలో భారతీయులు విజయవంతమయ్యారని, ఇలాంటి వాళ్లను మార్చలేమని, పేరు చివర తోక తీసేయడం మొదట మనం చేయాల్సిన పని అని, అయితే అది ఏదో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లలో పేర్ల చివరన క్యాస్ట్ లేకపోతే మార్పు సాధించినట్టు కాదని, అంతరాల్లో చేయాలని, అయ్యో అలా చేస్తే మావాళ్లు ఒప్పుకోరు అంటుంటారని, అలాంటి వాళ్లు మీకు కావాలా వద్దా అనేది మీరు ఆలోచించుకోవాలని పేర్కొన్నారు.
అన్ని మతాల్లో కులపిచ్చి
కులపిచ్చి అన్ని మతాల్లో ఉందని ఆమె పేర్కొన్నారు. తమిళనాడ తాను చూసిన ఓ క్రైస్తవ సంఘం గురించి చెప్పారు. కాబట్టి కులాన్ని అంత త్వరగా ఈ దేశం నుంచీ తీసేయలేకపోతున్నామని వాపోయారు. ఈ సందర్భంగా మనం చేయాల్సినవి ఉన్నాయని, కులం గురించి చెప్పవద్దని, రెండోది కుల ప్రస్తావన వస్తే వద్దని వారించాలని, మూడోది విరివిగా పుస్తకాలు చదవాలని, అన్ని రకాల సిద్ధాంతాలను అధ్యయనం చేయాలన్నారు. నాలుగోది విద్యా వ్యవస్థను విమర్శించడం ఆపి, పిల్లలకు మంచి అలవాట్లు నేర్పాలన్నారు.