రసాయనాలు తాగించింది: ప్రత్యూష సవతి తల్లికి హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్: ప్రత్యూషను చిత్రహింసలకు గురి చేసిన కేసులో ఆమె సవతి తల్లి చాముండేశ్వరి అలియాస్ శ్యామల దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను హైకోర్టు మంగళవారం నాడు కొట్టివేసింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఈ ఆదేశాలు జారీ చేశారు.
ప్రత్యూషను చిత్రహింసలు పెట్టిన కేసులో శ్యామలను జూలై తొమ్మిదో తేదిన శ్యామల భర్త, ప్రత్యూష తండ్రి రమేశ్ను జూలై 15న ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్యామలకు దిగువ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆమెను చంచల్గూడ జైలుకు తరలించారు.
తనకు బెయిల్ మంజూరు చేయాలని శ్యామల గతంలో దిగువ కోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి నిరాకరించడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా శ్యామలకు బెయిల్ను మంజూరు చేయవద్దని అదనపు పీపీ రాంరెడ్డి కోర్టుకు విన్నవించారు.
ప్రత్యూష పేరిట ఉన్న ప్లాట్, బంగారం స్వాధీనం చేసుకునేందుకు దాడి చేసి చిత్రహింసలకు గురిచేసినట్లు కోర్టుకు నివేదించారు. చురకలు పెట్టడమే కాకుండా రసాయనాలను సైతం తాగించిందని, ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే ప్రత్యూషను బెదిరించడంతో పాటు సాక్షులను లోబర్చుకునే ప్రయత్నం చేస్తుందని రాంరెడ్డి చెప్పారు.
ఏపీపీ (అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్) వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఈ కేసును హైకోర్టు స్వయంగా పర్యవేక్షిస్తుందని న్యాయమూర్తి తెలిపారు. వాదనలను పరిశీలించిన న్యాయస్థానం, శ్యామలకు బెయిల్ మంజూరుకు నిరాకరించింది.