'నిజాం విదేశీయుడు, ఇప్పుడు 'ఐసిస్' ఏం చేస్తుందో నాడే రిజ్వీ చేశాడు'
హైదరాబాద్: నిజాం పూర్వీకులు బాబరు, ఔరంగజేబు దేవాలయాల విధ్వంసకులు అని, నిజాం భావాలు ఔరంగజేబులాంటివేనని, నిజాం విదేశీయుడని విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా బుధవారం నాడు అన్నారు.
భాగ్యనగరంలోని బంజారాహిల్స్లో హిందూ బంధం సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవం - హిదూ ఐక్యతపై ఆయన మాట్లాడారు. స్వాతంత్రం వచ్చాక సంస్థానాలు పాకిస్తాన్లోనో, హిందూస్తాన్లో గాని కలపవచ్చని బ్రిటిష్ పన్నిన కుటిల పన్నాగంతో హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లీంస్థాన్గా మార్చాలని నిజాం ఆలోచించాడని విమర్శించారు.
ఈ రోజు సిరియాలో ఐసిస్ ఏం ప్రకటిస్తుందో ఆ రోజు రిజ్వీ అదే ప్రకటించాడన్నాడు. జిహాదీ పేరిట హిందూవాదంపై యుద్ధం ప్రకటించే నాటి, నేటి వాతావరణాల మధ్య తేడా ఏమీ లేదన్నారు. బాబర్, ఔరంగజేబు వారసులకు ఈ దేశం లొంగదన్నారు.
నిజాం విదేశీయుడని, ఆయన పూర్వీకులు బాగ్దాద్(ఇరాక్)కు చెందిన వారన్నారు. హైదరాబాద్ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు తెలంగాణ సర్కారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ తొగాడియా విజ్ఞప్తి చేశారు.