ప్రాయుత చండీయాగం చేస్తా: కెసిఆర్, హిందుత్వవాదులే యాగం చేయలేదు: స్వామి
మెదక్: విశ్వశాంతి కోసమే తాను ఆయుత చండీయాగం చేశానని, ప్రాజెక్టులన్నీ పూర్తయితే ప్రాయుత చండీయాగం చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం అన్నారు. ఆయుత చండీయాగం అనంతరం ఆయన రుత్వీజులను ఉద్దేశించి మాట్లాడారు.
తాను తలపెట్టిన అన్ని కార్యక్రమాలు సాకారమయ్యేలా దీవించాలని అమ్మవారిని మొక్కుకున్నానని కెసిఆర్ అన్నారు. లోకకల్యాణం కోసమే ఆయుత చండీయాగం నిర్వహించామన్నారు. తెలంగాణ ప్రజలందరి సంతోషమే తనకు తృప్తి అన్నారు.
కెసిఆర్ మాట్లాడుతూ.... 'ఇది మహాయాగం. శృంగేరికి వెళ్లి ఆశీస్సులు తీసుకుంటున్నప్పుడు స్వామీజీ స్వయంగా... మీరు పెద్ద సాహసమే చేశారు అన్నారు. అది పరిపూర్ణమవుతుందన్నారు. చిన్నాచితకా ఆటంకం వస్తే మనసు చిన్నబుచ్చుకోవద్దని, కొనసాగించమని నన్ను దీవించారు.
వారి దీవెనఫలించి ఈరోజు యాగం సుసంపన్నమయ్యింది. ఇది ఎవరో ఒక్కరి శ్రేయస్సుకోసం చేసింది కాదు. లోకకల్యాణం, విశ్వశాంతి విశేషించి ఒక వంద సంవత్సరాలు దుఃఖపడి ఇటీవలనే విముక్తమై ప్రగతి వైపు అడుగులువేస్తున్న తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి ఈ యాగాన్ని నిర్వహించాను.
మనందరికీ ఈ యాగం చేసే భాగ్యాన్ని అమ్మ దయ చూపి కలిగించింది. చాలా పట్టుదలగా రుత్విజ మహాశయులందరు అద్భుతంగా యాగం నిర్వహించారు. నేను మీకు ఇచ్చే సంభావన చంద్రునికో నూలు పోగులాంటిది.
మన సంప్రదాయం గురించి అంత భయపడాల్సిన అక్కరలేదని నేను ఎపుడూ చెబుతూ వచ్చాను. దీంట్లో ఉన్న పునాదేమిటో, ఆ పునాది లోతేమిటో, ఆ బలమేమిటో చాలామందికి తెలియదు. నాబోటి చిన్నవాళ్లు ఇంకా ఇంకా పుడతారు. మీబోటి బ్రాహ్మణోత్తములు, రుత్విజోత్తములు కూడా కార్యయజ్ఞం చేయడానికి ఎల్లపుడూ సిద్ధంగా ఎపుడూ ఉంటారు.
కాబట్టి తప్పకుండా మన సంప్రదాయం, సంస్కారం సుసంపన్నంగా ఉంటుంది. సుభిక్షంగా ఉంటుంది. ధర్మం ఎల్లెడెలా తప్పకుండా విస్తరిస్తూనే ఉంటుంది. సామూహికంగా జరగాల్సినటువంటి మహా పూర్ణాహుతిని కూడా మనం పూర్తి చేశాం. కొంతమంది అపహాస్యం చేశారు.
అవాకులు, చెవాకులు మాట్లాడారు. వాటిని నేనెక్కడా పట్టించుకోలేదు. అష్టకాల రామ్మోహన శర్మగారు నా మిత్రులు. ఒకే గ్రామస్తులం. ఆయన ప్రతి సంవత్సరం శృంగేరికి వెళ్తారు. స్వామివారి ప్రసాదం తెచ్చిస్తారు. 2011లో కూడా ఆయన వెళ్లి వచ్చారు.
అపుడు తెలంగాణ కోసం పోరాటంలో ఉన్నాం. ఆ సమయంలో వారు అక్కడ యాగంలో పాల్గొని ప్రసాదం తెచ్చి ఇచ్చారు. విశేషమేమిటని అడిగితే అక్కడ అయుత మహా చండీయాగం గొప్పగా నిర్వహించారని చెప్పారు. అమ్మవారి అక్షింతలు నామీద చల్లారు.
ఆ వెంటనే ఆలస్యం చేయకుండా నేను కూడా ఈ రోజు నుంచి దీక్ష తీసుకుంటున్నా. తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మవారు ప్రసాదిస్తే వందశాతం అయుత చండీయాగం చేస్తానని చెప్పాను. ఇంత పెద్ద పెద్ద షెడ్లు మనం వేయగలమా ఇంత పెద్ద యాగశాల మనం నిర్వహించగలమా ఇంతమంది రుత్విజులకు మనం ఏర్పాట్లు చేయగలమా అని భయపడేవాన్ని.
అయినా శృంగేరీలో జరిగినటువంటి చండీయాగం ఇచ్చిన స్ఫూర్తితో ఇక్కడ మనం అయుత చండీయాగం చేశాం. అందుకే త్వరలో సకుటుంబ సమేతంగా ఇక్కడ పనిచేసే కార్యకర్తల సమేతంగా శృంగేరీకి వెళ్లి స్వామివారి ఆశీస్సులు మళ్లీ పొందుతాను.
ఒక రాష్ట్రాన్ని కాంక్షించి సాధించాను. ప్రజలిచ్చిన అవకాశంతో ఈ రోజు అత్యున్నతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాను. ఇంతకంటే నాకు కావాల్సిందేమీ లేదు. తెలంగాణలోఅన్ని వర్గాల వారు, కులాల వారు అంతా చిరునవ్వుతో , హాయిగా సంతోషంగా బతుకగలిగితే అంతకన్నా సంతోషం నాకు మరొకటి లేదు. అది జరగాలి.
జరిగి తీరుతుందనే సంపూర్ణ విశ్వాసం నాలో ఉంది. ఆ దిశగానే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోంది. నేను తలపెట్టిన మిషన్ భగీరథ కోసం ఆ దేవిని నేను ప్రార్థిస్తున్నా.. ఇది ప్రజల కోసం కాబట్టి యాగఫలంగా ఇది తొందరగా ఆటంకాలు లేకుండా పూర్తిచేయించేలా దీవించమని కోరుకుంటున్నా. అలాగే మిషన్ కాకతీయ. కాకతీయ రెడ్డి రాజులు నిర్మించిన చెరువులన్నీ సమైక్య రాష్ట్రంలో ధ్వంసమయ్యాయి. వాటి పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతున్నది. అది పరిపూర్ణం కావాలి.
అలాగే నీటికేటాయింపులున్నాయి. ఆ ప్రాజెక్టులకు ఈ సంవత్సరం నుంచి ప్రతి ఏటా 27వేల కోట్లు బడ్జెట్లో పెట్టి పెద్ద ఎత్తున అమ్మపేరు తీసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాం.
ఈ పథకాలన్నీ పూర్తి అయ్యి తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటే స్వామివారు ఆజ్ఞ ఇస్తే మీ అందరి దయతో ప్రయుత చండీయాగాన్ని కూడా నిర్వహిస్తాను. ప్రయుత చండీయాగానికి కూడా ప్రయుక్తలుగా మళ్లీ మీరే కావాలని కోరుకుంటున్నా. ఏవైనా చిన్న చిన్న అసౌకర్యాలు జరిగితే దయచేసి క్షమించాలని కోరుతున్నా' అని కెసిఆర్ అన్నారు.
అంతకుముందు శారదాపీఠం స్వరూపనందేంద్ర స్వామి మాట్లాడుతూ.... దేశంలో ఇంత వరకు హిందూవాదులమని చెప్పుకున్న ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి యాగాన్ని చేయలేదన్నారు. కెసిఆర్ ఆయుత చండీయాగం అద్భుతంగా చేశారన్నారు.