కేసీఆర్ ఉద్యోగులనూ మోసం చేశారు: మూడేళ్లుగా ఎదురుచూస్తే ఇదేనా? బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్: మరోసారి ఉద్యోగులను మోసం చేశారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా, ఫిట్మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. ఈ మేరకు బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
హెచ్ఆర్ఏ తగ్గించడం దారుణం
ప్రభుత్వ ఉద్యోగులను మూడేళ్లుగా ఊరించి ఇప్పుడు ఉసూరుమనిపించారని విమర్శించారు. 7.5 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి మూడేళ్లు సమయం కావాలా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఫిట్మెంట్ 7.5 శాతం ఇచ్చి హెచ్ఆర్ఏ 6 శాతం తగ్గించాలని ప్రతిపాదించడం దారుణమని అన్నారు. రోజు రోజుకీ ఇంటి అద్దెలు పెరుగుతుంటే హెచ్ఆర్ఏని ఎలా? తగ్గిస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు.
నిరుద్యోగులను, రైతులను.. ఇప్పుడు ఉద్యోగులనూ..
ఉద్యోగులు కోరినట్లుగా 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ వేసినప్పుడు ఐఆర్ ఇవ్వడం సంప్రదాయమని, కానీ, అది ఇవ్వడం లేదని బండి సంజయ్ మండిపడ్డారు.ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగులను, సన్నబియ్యం పేరుతో రైతులను మోసం చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఉద్యోగులను కూడా మోసం చేశారని ధ్వజమెత్తారు.
మూడేళ్లుగా ఎదురుచూస్తే ఇదేనా?
అసలు సీఆర్ బిస్వాల్ నేతృత్వంలోని కమిటీని రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛగా పనిచేయనిచ్చిందా? లేక బలవంతంగా పీఆర్సీ రాయించారా? అని నిలదీశారు బండి సంజయ్. మూడేళ్లుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చేది ఇదేనా? అని ప్రశ్నించారు. ఇంతదారుణమైన అతి తక్కువ ఫిట్మెంట్ను ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎప్పుడూ ఇవ్వలేదని సంజయ్ అన్నారు.
ఉద్యోగుల్లో అసంతృప్తి.. పునరాలోచించాలని కేసీఆర్కు వినతి
ఇది ఇలావుండగా, ఫిట్మెంట్ తక్కువగా ఇవ్వడం పట్ల తెలంగాణ ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిట్మెంట్ ప్రతులను చించేసి తగలబెట్టారు. కేసీఆర్ తమను మోసం చేశారంటూ మండిపడుతున్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్యోగ జేఏసీ నేతలు నిరసన చేపట్టారు. పీఆర్సీ కమిటీని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. తమ వేతనాలను తగ్గించడానికి వేసిన కమిటీ అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా ఆలోచించి మంచి ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఆందోళనలు చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
Recommended Video