గర్భిణీ హత్య: ఏజ్ గ్యాప్ వల్ల వివాహేతర సంబంధం, పింకీ ఫ్యామిలీ పరిస్థితి ఇదీ.. కనీసం ఫోటో లేదు
Recommended Video
హైదరాబాద్: కలకలం రేపిన ఎనిమిది నెలల గర్భిణీ పింకీ (32) హత్య కేసులో కీలక నిందితుడు అమర్కాంత్ ఝాను బుధవారం పోలీసులు హైదరాబాద్ తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. పింకీ డెడ్ బాడీనీ ఎనిమిది ముక్కలుగా నరికి బొటానికల్ గార్డెన్ వద్ద పడేసిన ఘటనలో అమర్కాంత్ తల్లి మమత, తండ్రి అనిల్లను పోలీసులు అంతకుముందే అరెస్ట్ చేశారు.
పింకీని హత్యచేసే ప్రణాళికలో భాగంగా అమర్కాంత్ తాను పని చేసే బార్ ఫ్లోర్ మేనేజర్ బర్దన్ వద్ద యమహా బైక్ కొనుగోలు చేశాడు. కేవలం రూ.2వేలు ముందస్తుగా చెల్లించి బైకును తీసుకున్నాడు. గత నెల 25వ తేదీ నుంచే బార్కు వెళ్లడం మానేశాడు. ఆ తర్వాత 28వ తేదీన అమర్కాంత్, మమత, అనిల్, వికాస్లు కలిసి పింకీని హత్య చేశారు.
చదవండి: గర్భిణీ హత్య: అవే పట్టించాయి.. ఇలా చేధించారు, 'పింకీతో సహజీవనం మమతతో సంబంధం'
29న అదే బైక్పై రెక్కీ నిర్వహించారు
పింకీ డెడ్ బాడీని పడేసేందుకు 29వ తేదీ ఉదయం అదే బైక్ పైన రెక్కీ నిర్వహించారు. ఇదే పోలీసులకు కీలక ఆధారమైన విషయం తెలిసిందే. మడ్ గార్డు లేని యమహా బైకుపై వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో లభ్యమైంది. ఓసారి తన తలపై శిరస్త్రాణం తీసినప్పుడు బట్టతల ఉన్నట్లు తేలడంతో ఎస్వోటీ బృందం దర్యాఫ్తు ఆ దిశగా సాగింది.
అలా వాహనం నెంబర్ చిక్కింది
సీసీ ఫుటేజీల ఆధారంగా సిద్దిఖీ నగర్, అంజయ్య నగర్లలోనే నిందితులు ఉంటారని నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. అదే బైక్ ఆ పరిసర ప్రాంతాల్లో సంచరించిందా అనే కోణంలో విశ్లేషించారు. దీంతో కీలక ఆధారం లభించింది. రెక్కీ సమయంలో అమర్కాంత్ అదే వాహనంపై, అదే టీ షర్టుతో ఉన్నట్లు తెలియడంతో పగటిపూట కావడంతో ఓ ప్రాంతంలోని సీసీ కెమెరాలో వాహనం నెంబర్ చిక్కింది.
పని పూర్తవడంతో బైక్ నచ్చలేదని తిరిగిచ్చాడు
వాహనంపై ఉన్న స్పాట్ చలానా ఆధారంగా బర్దన్ను విచారించడంతో అమర్కాంత్ సమాచారం లభించిన విషయం తెలిసిందే. తొలుత మమత, అనిల్లను అదుపులోకి తీసుకొని విచారించడంతో కేసు చిక్కుముడి వీడింది. ఆ తర్వాత అమర్కాంత్ చిక్కాడు. మరో ఆసక్తికర విషయం ఏమంటే.. తొలుత బైక్ కొనుగోలు చేసిన అమర్కాంత్ మృతదేహం తరలింపు పూర్తి కావడంతతో ఆ బైక్ నచ్చలేదని తిరిగి ఇచ్చాడు. తన డబ్బు వాపస్ తీసుకున్నాడు.
అంతకుముందు కారు యజమాని విచారణ
పింకీని నిందితులు స్టోన్ కట్టర్తో ఎనిమిది ముక్కలుగా చేసిన విషయం తెలిసిందే. సాధారణంగా మృతదేహాన్ని కారులో తెచ్చి పడేస్తుంటారు. దీంతో ఆ ఘటన జరిగినప్పుడు తిరిగిన కార్ల గురించి ఆరా తీశారు. తొలుత అర్ధరాత్రి సమయంలో వచ్చి ఆగిన కారు విషయమై ఆరా తీశారు.
కార్లతో ఫలితం లేకపోవడంతో బైక్ దిశగా విచారణ
ఆ కారు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన హన్మంతుదిగా గుర్తించారు. మరో కారును గర్తించారు. దానిని మియాపూర్కు చెందిన హసన్ అలీదిగా గుర్తించారు. వీరి వద్ద అనుమానించదగ్గ విషయం లభించలేదు. అయిదారు రోజులపై కార్లపై దృష్టి సారించిన పోలీసులు ఫలితం లేకపోవడంతో బైక్ వైపు విచారణ మళ్లించారు. దీంతో నిందితులు దొరికారు.
ఏజ్ గ్యాప్ ఉండటంతో వివాహేతర సంబంధం
ఇదిలా ఉండగా, మృతురాలి ఒంటిపై ఉన్న దుస్తులు, ఇతర వస్తువుల ఆధారంగా పోలీసులు పింకీ నిరుపేద కుటుంబానికి చెందినదిగా భావించారు. వారి అనుమానం నిజమే అయింది. పింకీకి పదమూడేళ్ల క్రితం ఓ వ్యక్తితో పెళ్లయింది. వారికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు. భర్తతో విభేదాల కారణంగా అదే గ్రామంలోని వికాస్కు దగ్గరైంది. చిన్న కొడుకు జతిన్ను తీసుకొని వికాస్తో కలిసి సొంతూరుకు వెళ్లింది. ఆ తర్వాత వికాస్ హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాదులోనే భార్యాభర్తలైన అనిల్, మమతలు నిర్వహిస్తున్న గప్ చుప్ బండి వద్ద పని చేసేవాడు. అనిల్, మమతల కొడుకు అమర్ కాంత్. అనిల్, మమతల (భార్యాభర్తలు) మధ్య 38 ఏళ్ల తేడా ఉంది. దీంతో వికాస్తో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.
పింకీ తిరిగి రావడం మమతకు కంటగింపుగా మారింది
45 రోజుల క్రితం పింకీ హైదరాబాద్ వచ్చింది. వికాస్తో వివాహేతర సంబంధం నడుపుతున్న మమతకు ఇది కంటగింపుగా మారింది. గర్భిణీగా ఉన్న పింకీకి ఎవరైనా పుడితే వాటా ఇవ్వాల్సి వస్తుందని, సంపాదనలో పింకీ అడుగుతుందని, వివాహేతర సంబంధం కొనసాగించడం కష్టమవుతుందని, మరోవైపు పింకీ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది. దీంతో ఆమెను అంతమొందించాలని మమత నూరిపోసింది.
కనీసం ఫోటో లేదు, కడు పేదరికంలో పింకీ ఫ్యామిలీ
పింకీ తండ్రి లెయ్య ఉపాధి నిమిత్తం రాజస్థాన్కు వలస వెళ్లి ఇటుక బట్టీల తయారీ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఏడాదికి ఓసారి మాత్రమే ఇంటికి వస్తుంటాడు. పింకీ తల్లి.. పెళ్లి కావాల్సిన తన చిన్న కూతురుతో కలిసి ఇంట్లో ఉంటోంది. పింకీ సోదరుడు లెయ్య బంకా జిల్లాలో తన మామ ఇంట్లో ఉంటున్నాడు. బొటానికల్ గార్డెన్ వద్ద చనిపోయింది పింకీ అని నిర్ధారించుకున్న పోలీసులు ఆమె స్వస్థలానికి వెళ్లారు. వారి కుటుంబం పేదరికంలో ఉన్నట్లు గుర్తించారు. చిన్న పూరిగుడిసెలో నివసిస్తున్నారు. పేదరికం కారణంగా వారి ఇంట్లో ఒక్క ఫోటో కూడా లేదు. దుస్తుల ఆధారంగా తల్లి గుర్తించి బోరున విలపించింది. కాగా, పింకీ హత్య కేసులో ఆమె తనయుడు జతిన్ కీలక సాక్షిగా మారాడు.