కోఠి ప్రసూతి ఆసుపత్రిలో వైద్యం అందక గర్భిణీ మృతి: కడుపులోనే మరణించిన శిశువు
హైదరాబాద్: నగరంలోని కోఠి మెటర్నిటీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మెటర్నిటీ ఆసుపత్రిలో వైద్యం అందక మమత నిండు గర్భిణి మంగళవారం మృతి చెందింది. గర్భిణితో పాటు కడుపులో ఉన్న శిశువు కూడా మరణించడంతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది.
ఈ సమాచారం అందుకున్న మమత బంధువులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చిన మమతను రెండు రోజుల తరువాత రమ్మని వైద్యులు సూచించారు.
అయితే మమతకు తీవ్రమైన నొప్పులు రావడంతో సోమవారం ఆసుపత్రికి వచ్చింది. సరైన సమయంలో వైద్యులు చికిత్స అందించకపోవడంతో మమత చనిపోయినట్లు సమాచారం. పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరిన మమత పట్ల డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
పురిటి నొప్పులతో వచ్చిన మమత, ఆమె కడుపులోని బిడ్డ చనిపోవడంతో కోఠిలోని మెటర్నిటీ ఆసుపత్రిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మమత మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించారు.
మరోవైపు స్థానికులు ఈ సంఘటనపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఆసుపత్రిలో ఇటువంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. చికిత్స కోసం వచ్చి గర్భిణీలు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. ఆసుపత్రి సిబ్బంది గర్భిణీల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆసుపత్రిలో అవినీతి వెలుగు చూస్తోందని, సిబ్బంది ప్రతీ చిన్న పనికి డబ్బు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.