సంబరాలకు సిద్ధం అవ్వండి.. క్లీన్ స్వీప్ చేస్తున్నాం .. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కేసీఆర్
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఇక ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలోని మొత్తం లోక్సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేయబోతున్నామని, సంబరాలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఒక పక్క కాంగ్రెస్ ఈ దఫా లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కొన్ని స్థానాలు కైవసం చేసుకుంటామన్న ధీమాలో ఉన్నారు .
తెలంగాణా సీఎం కేసీఆర్ మాత్రం ప్రత్యర్ధి పార్టీకి అంత సీన్ లేదంటూ లోక్ సభ ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్ దే అంటూ ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని మంత్రులు, పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బుధవారం తన నివాసంలో సమావేశమైన కేసీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫలితాలు ఏకపక్షంగా ఉండబోతున్నాయని, 16 లోక్సభ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకోబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అంతే కాదు లెక్కింపు సమయంలో ఇబ్బందులు ఎదురైతే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల విధానానికి టీఆర్ఎస్ పూర్తి మద్దతు ప్రకటించినట్టు కేసీఆర్ తెలిపారు. ఈ విషయంలో విపక్షాలది అనవసర రాద్ధాంతమని కొట్టిపారేశారు.విపక్షాలు మళ్లీ చిత్తుగా ఓడిపోబోతున్నాయన్నారు కేసీఆర్ .
మొత్తానికి తెలంగాణలో 16 స్థానాల్లో విజయంపై పూర్తి ధీమాతో ఉన్న కేసీఆర్ ఇంకొన్ని గంటల్లో ఎన్ని స్థానాలు సాధిస్తారో తేలనుంది .. ప్రజలు కేసీఆర్ అంచనాలను నిజం చేస్తారా ? లేదా తలక్రిందులు చేస్తారా ? అన్నది తెలియటానికి ఎంతో సమయం లేదు .