మున్సిపోల్స్ కు రంగం సిద్ధం .. బ్యాలెట్ వైపే మొగ్గు .. ఆగస్ట్ లో ఎన్నికలు?
తెలంగాణా రాష్ట్రంలో మున్సిపోల్స్ కు రంగం సిద్ధం అవుతుంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం 131 మున్సిపాలిటీల కమిషనర్లు, సీడీఎంఏ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
సాంకేతిక సమస్యలు, ఈవీఎంల కొరతతో బ్యాలెట్ వైపు మొగ్గు చూపిన ఎన్నికల సంఘం
గతంలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ తో పాటు పలు కార్పొరేషన్లలోఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించినా సాంకేతిక ఇబ్బందుల నేపధ్యంలో వచ్చే మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది . ఈవీఎంలు సరిపడా లేకపోవడం, సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలోనే బ్యాలెట్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది. ఆయా మున్సిపాలిటీల పరిధిలో ముద్రణ సంస్థలను ఎంపిక చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. బ్యాలెట్ పత్రాలను స్థానికంగా ముద్రించుకోవచ్చని పేర్కొన్నది.
త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు .. ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం
అటు ఎన్నికల కోసం వార్డుల వారీగా ఓటర్ల జాబితాను రెడీ చేస్తున్నారు అధికారులు . వార్డుల విభజన పూర్తి కావడంతో పోలింగ్ కేంద్రాల తుది జాబితా కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది . పోలింగ్ కేంద్రాల ముసాయిదాను ఈ నెల 10న విడుదల చేయాల్సి ఉన్నది. 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉండాలని, 800 దాటి ఐదుగురు ఓటర్లున్నా ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
జులై 21 న నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్ట్ 11 వ తేదీన పోలింగ్ నిర్వహించే ఆలోచన
ఇప్పటికే 131 మున్సిపాలిటీల పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల ఓటరు జాబితాను దాదాపు ఖరారు చేసి..సీడీఎంఏకు అప్పగించారు. జులై 18న ఓటర్ల ఫోటోలతో తుది జాబితా విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు . 131 మున్సిపాలిటీలతో పాటు కరీంనగర్, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లలో పోటో ఓటరు జాబితాను ఖరారు చేయాలని కూడా నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల సంఘం ఇక షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12న ఓటరు జాబితా ముసాయిదాను వార్డుల వారీగా విడుదల చేయాలని, 12 నుంచి 16 వరకు ఓటర్ జాబితాపై అభ్యంతరాలు స్వీకరించాలని పేర్కొన్నారు. ఈ నెల 12న జిల్లా ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో 13న మున్సిపాలిటీల్లో రాజకీయ పక్షాలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.నోటిఫికేషన్ విడుదలయ్యే వరకూ జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇక జులై 21 న నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్ట్ 11 వ తేదీన పోలింగ్ నిర్వహించే ఆలోచనలో ఉన్నారని సమాచారం .