ప్రణబ్ రాక: బొల్లారం రాష్ట్రపతి నిలయంలో కోబ్రా హల్చల్
హైదరాబాద్: సికింద్రాబాదులోని బొల్లారంలో గల రాష్ట్రపతి నిలయంలో పాముల బెడద ఎక్కువగానే ఉంటుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం అందులో అడుగు పెట్టారో లేదో నాలుగు అడుగుల కోబ్రా పాకుతూ భవనం వైపు రావడం ప్రారంభించింది. దాంతో ఉత్కంఠ వాతావరణం చోటు చేసుకుంది.
రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్స్ రంగంలోకి దిగి వెంటాడి కోబ్రాను పట్టేశారు. కోబ్రా ఆమ్లా గార్డెన్ నుంచి రాష్ట్రపతి నిలయంలోని భవనం వైపు పాకుతూ వచ్చింది. గత కొద్ది రోజులుగా రాష్ట్రపతి నిలయంలో మూడో కోబ్రాను పట్టుకున్నట్లయింది. వాటికి కోడు రాష్ట్రపతి నిలయం ఆవరణలో ఎనిమిది సరీసృపాలను కూడా పట్టుకున్నారు.
రాష్ట్రపతి భవన్లోకి ప్రణబ్ ముఖర్జీ అడుగు పెట్టిన 20 నిమిషాల తర్వాత అధికారులు హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్న సమయంలో కోబ్రా భవనంపై రావడాన్ని స్నేక్ క్యాచర్స్ గుర్తించారు. వెంటనే వారు దాన్ని చుట్టుముట్టి మూడు నిమిషాల్లో పట్టేశారు.
పట్టుకున్న సరీసృపాలను అన్నింటినీ నెహ్రూ జంతుప్రదర్శన శాలకు తరలించారు. ప్రణబ్ ముఖర్జీ పది రోజుల పాటు రాష్ట్రపతి నిలయంలో ఉంటారు. ఆయన ఇక్కడ ఉన్నన్ని రోజులూ స్నేక్ క్యాచర్స్ 24 గంటల పాటు అప్రమత్తంగా ఉంటారు.