ప్రపంచ తెలుగు మహాసభలో బాలకృష్ణ సవాల్, తెలంగాణకు రెండూ తెలుసు
Recommended Video
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ఓ సవాల్ చేశారు. మూడు నిమిషాలు ఒక్క పరాయిపదం లేకుండా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడేవారు ఉన్నారా అని అడిగారు.
ఎల్బీ స్టేడియంలో సోమవారం రాత్రి తెలుగు మహాసభలకు సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ పై సవాల్ చేశారు. తెలుగు భాషలలోని యాసల గురించి ప్రస్తావించారు.
ఇదీ తెలుగు భాష
కమ్మనైన తెలుగు భాషలో గోదావరి వంపులు ఉన్నాయని, తెలంగాణ మాగాణం తెలుగు భాష అని, రాయలసీమ పౌరుషం తెలుగులో ఉంటుందని, కోనసీమ కొబ్బరి నీళ్ల లేతదనం తెలుగు భాషలో ఉంటుందని బాలకృష్ణ అన్నారు. తెలుగు జాతికి గౌరవం దక్కాలంటే ముందు తెలుగు భాషను గౌరవించాలన్నారు.
తెలంగాణ భూమ్మీద పుట్టిన వారికి రెండూ తెలుసు
ఎన్టీఆర్ పేరు వింటే రక్తం ఉప్పొంగుతుందని, తెలుగు పదం వింటే తనువు పులకిస్తుందని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ను అన్న అని పిలచుకునే అభిమానం మారలేదని ఆయన అన్నారు. తెలంగాణ భూమ్మీద పుట్టిన వారికి అభిమానించడమే కాదు ఎదిరించడమూ తెలుసునని వ్యాఖ్యానించారు.
అది విప్లవాత్మకం
కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి మాట్లాడుతూ.. తెలుగు భాషకు గుర్తింపు తీసుకు రావాలనే సంకల్పంతో తలపెట్టిన మహాసభల స్ఫూర్తి ముందుకు సాగాలని వ్యాఖ్యానించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకం అన్నారు.
సత్కరించిన కేటీఆర్
ఈ సభలో మంత్రులు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస యాదవ్, నాగార్జున, వెంకటేష్, ఆర్ నారాయణమూర్తి, రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, దర్శకులు ఎన్ శంకర్, నరసింగరావు మాట్లాడారు. నటులు, దర్శకులు, నిర్మాతలను గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్ సత్కరించారు. కాగా, ప్రపంచ తెలుగు మహాసభల ముగింపుకు రాష్ట్రపతి కోవింద్ రానున్నారు.