నడిరోడ్డుపై ల్యాండ్ మైన్ల అలజడి, ఎవరు పెట్టారు, మరిన్ని అమర్చారా?
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాంబుల కలకలం చెలరేగింది. జిల్లాలోని వెంకటాపురం (కె) మండలంలోని అబ్బాయిగూడెం సమీపంలోని రహదారిపై రెండు బాంబులు అమర్చినట్లు పోలీసులు గుర్తించారు.
జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం బాంబుల కలకలం చెలరేగింది. జిల్లాలోని వెంకటాపురం (కె) మండలంలోని అబ్బాయిగూడెం సమీపంలోని రహదారిపై రెండు బాంబులు అమర్చినట్లు పోలీసులు గుర్తించారు.
మావోయిస్టులు పెట్టి ఉంటారని అనుమానం
పోలీసుల వాహనాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఈ బాంబులు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. రహదారిలో బాంబులు అమర్చినట్లు గుర్తించడంతో బాంబు స్క్వాడ్ సాయంతో వాటిని నిర్వీర్యం చేశారు.
ఏడాది క్రితం పెట్టారా
వెంకటాపురం దారిలో బాంబులను ఏడాది క్రితం పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. విషయం తెలియగానే జేసీబీతో రోడ్డును తొలగించి వాటిని వెలికి తీశారు. ఈ రెండు బాంబులు సుమారు 30 కిలోలు ఉన్నాయి.
ఆ బాంబులు ఎందుకు పెట్టారు
కూంబింగ్ బలగాలు వరంగల్ నుంచి తాడ్వాయి, ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం మీదుగా అటవీ ప్రాంతంలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వెంకటాపురం సమీపంలో ర్డుడుపై పెట్టడం గమనార్హం. నేతలను లక్ష్యంగా పెట్టుకొని పెట్టారా అనే చర్చ కూడా సాగుతోంది.
రోడ్డులో ప్రెషర్ కుక్కర్
కాగా, గత ఏడాది జూలైలో ఇదే రోడ్డులో ప్రెషర్ కుక్కర్ బాంబును మావోయిస్టు పార్టీ అమర్చింది. దానిపై ఓ గిరిజన యువకుడు తెలియక కాలు వేశాడు. అది పేలడంతో అతనికి గాయాలయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో అనేక ల్యాండ్ మైన్లు అమర్చి ఉంటారని నిఘా విభాగం భావిస్తోంది.