సివి ఆనంద్కు అరుదైన గౌరవం: ఈసీ ప్రత్యేక అవార్డు
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్కు అరుదైన గౌరవం దక్కింది. వృత్తిలో తన నిబద్ధతను చాటుకున్న ఆయనకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అవార్డును ప్రకటించింది. నిరుడు సార్వత్రిక ఎన్నికల్లో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపి ధనప్రవాహానికి అడ్డుకట్ట వేసిన కమిషనర్ సీవీ ఆనంద్కు 2014లో బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్కు (ఉత్తమ ఎన్నికల సంబంధిత చర్యలు చేపట్టినందుకు) ఈసీ నేషనల్ స్పెషల్ కేటగిరీ అవార్డు ప్రకటించింది.
2014లో సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కట్టుదిట్టమైన వ్యయ పర్యవేక్షణతో ధన ప్రవాహానికి అడ్డుకట్టే వేసే విషయంలో ప్రశంసనీయమైన చర్యలు చేపట్టినందుకు ఆయనను ఈ పురస్కారానికి ఎంపికచేసినట్టు ఈసీ తెలిపింది. ఈ అవార్డు కోసం దక్షిణాది రాష్ట్రాల నుంచి 19 మంది నామినేట్ అవ్వగా.. అవార్డుకు సీవీ ఆనంద్ ఎంపికయ్యారు. ఆయనకు అవార్డు కింద రూ. 50వేల నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేయనున్నారు.
జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో జనవరి 25న సివి ఆనంద్ ఈ పురస్కారం అందుకోనున్నారు. తెలంగాణలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ 2014 ఏప్రిల్ 30 ఎన్నికల నాటికి అక్రమంగా రవాణా అవుతున్న రూ. 21.97 కోట్లు స్వాధీనపరుచుకొని దేశంలోనే అత్యధికంగా డబ్బు పట్టుకున్న కమిషనరేట్గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
తనకు అవార్డు రావడం పట్ల సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్పందిస్తూ.. ఎన్నికల్లో అక్రమాలు, అవినీతి జరగకుండా నిస్వార్థంగా సైబరాబాద్ పోలీసులు పనిచేశారని అన్నారు. జాతీయ స్థాయిలో తనకు వచ్చిన ఎన్నికల అవార్డు తెలంగాణ పోలీసు పనితనానికి నిదర్శనమన్నారు. ఎన్నికలు సమర్థంగా జరిగేందుకు కృషిచేసిన సైబరాబాద్ పరిధిలోని ఏడువేల మంది పోలీసు సిబ్బందికి ఈ అవార్డు అంకితమిస్తున్నట్లు ఆయన తెలిపారు.