తెలంగాణ బీజేపికి షాకిచ్చిన మోది..
తెలంగాణ బీజెపీకి అదిష్టానమే శరాఘాతంలా పరిణమించిందా..? గులాబీ పార్టీ అసమర్థ విధానాలపై అలుపెరగని పోరాటం చేస్తున్న కమలనాథుల ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరేనా..? టీఆర్ఎస్ పథకాలను పొగడ్తలతో ముంచెత్తుతున్న కేంద్రమంత్రుల వైఖరితో బిక్కుబిక్కు మంటున్న తెలంగాణ బీజెపి నేతలను ప్రధాన మంత్రే మరింత అగాధంలోకి నెట్టారా..? ఏ కేసీఆర్ ప్రభుత్వం ఐతే అవినీతి మయం అయ్యిందని పదేపదే బీజెపి నేతలు చెప్పుకొస్తున్నారో., అదే కేసీఆర్ ప్రభుత్వం అభివ్రుద్దిలో దూసుకుపోతోందని ప్రధాన మంత్రి కితాబివ్వడం స్థానికి బీజెపీ నాయకులకు పంటికింద రాయిలా పరిణమించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా అదిష్టానం వైఖరితో ఉసూరుమంటున్నారు తెలంగాణ బీజెపి నాయకులు.
కేసీఆర్ ను పొగడ్తల్లో ముంచి తెలంగాణ బీజెపిసి ఇరుకున పెట్టిన మోది..
తెలుగుదేశం పార్టీ లోక్ సభలో పెట్టిన అవిశ్వాస తీర్మానం కొన్ని పార్టీలకు మేలు చేస్తే కొన్ని పార్టీలకు కీడు తలపెట్టింది. తెలంగాణలో సీఎం కెసీఆర్ కు బ్రహ్మండమైన మైలేజ్ రాగా బీజేపి పార్టకి మాత్రం తీరని నష్టాన్ని కలుగజేసింది. రాజకీయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ లోక్ సభ సాక్షిగా చంద్రబాబు రాజకీయాలు చేస్తుంటే, కెసీఆర్ అభివృద్ధిపై దృష్టి పెట్టి వికాస్ పురుష్ గా మారారనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. సహజంగానే మోడీ వ్యాఖ్యలు తెలంగాణలో టీఆర్ఎస్ తో పాటు కెసీఆర్ ను అభిమానించే వారికి సంతోషం కలిగించగా, అదే టీఆర్ఎస్ విధానాలపై పోరాటం చేస్తున్న కమల శ్రేణులకు మాత్రం పల్స్ రేట్ ను పెంచాయి.
తెలంగాణ సీయం పై మోది ప్రశంసలతో ఉసూరుమంటున్న బీజెపి శ్రేణులు..
తెలంగాణ సీఎం కెసీఆర్ అసలు సచివాలయానికే రారని, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు, సీనియర్ ఐఏఎస్ లకూ అపాయింట్ మెంట్లు ఇవ్వరనే విమర్శలు ఉన్నాయి. ప్రగతిభవన్ లో అడుగుపెట్టడం సామాన్యుడికి జరిగే పనికాదు. మంత్రి కెటీఆర్ అయితే ఓ సమావేశంలో అసలు సీఎంను ప్రజలు కలవాల్సిన పనేముంది? అని వ్యాఖ్యానించారు. వారి సమస్యల పరిష్కారానికి గ్రామ, మండల, జిల్లా స్థాయి వంటి ఎన్నో అంచెలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఓ వైపు తెలంగాణ బిజెపి మిషన్ భగీరధ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని, అసలు తెలంగాణలో పాలన పడకేసిందని తెలంగాణ బిజెపి ఆరోపిస్తోంది. కాని అడపా దడపా కేంద్రమంత్రులు పర్యటనల సందర్బంగా ప్రభుత్వ పథకాలను పొగడటం ఉబ్బందిగా పరిణమించింది.
కేంద్ర మంత్రుల విరుద్ద ప్రకటనలతో కుదేలవుతున్న తెలంగాణ బీజేపి..
ఈ మధ్యే తెలంగాణ పర్యటనకు వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇదేనా టీఆర్ఎస్ అవినీతిపై పోరాటం అంటూ బిజెపి నేతలను ప్రశ్నించారు. బిజెపి జాతీయ నేతలు కూడా టీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ప్రదాని మోడీ ఒక్క దెబ్బతో లోక్ సభలో కెసీఆర్ ను పొగిడి తెలంగాణ లో బిజెపి రాజకీయ పోరాటాలకు గండికొట్టినట్లు అయిందనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించిన తరుణంలో మోడీ చేసిన ప్రకటన తెలంగాణ బిజెపికి షాక్ లాంటిదే. స్థానిక బిజెపి నేతలు ఎలాంటి విమర్శలు చేసినా, సహజంగానే టీఆర్ఎస్ నేతలు ప్రధాని మోడీ ప్రకటనను ప్రస్తావించి బీజేపి నేతలను ఇరుకుపెట్టడం ఖాయంగా కనపడుతోంది.
ఇప్పటికైనా ఆచితూచి మాట్లాడకపోతే మరింత నష్టపోతామంటున్న తెలంగాణ బీజేపి నేతలు
ఏపీలో టీడీపీతో స్నేహబంధం పూర్తిగా తెగిపోయినందున కెసీఆర్ ను ప్రశంసించటం ద్వారా మోడీ రెండు లాభాలు ఆశించినట్లు కన్పిస్తోంది. ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ స్నేహహస్తం అందుకోవటం...ఈ ఎన్నికల ముందు చంద్రబాబు ఇమేజ్ ను మరింత తగ్గించటం. మరి ఇవి ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయన్నదే ప్రశ్న. చంద్రబాబు నిత్యం సమీక్షలు..సమావేశాలతో కాలం గడిపేస్తున్నారు. కెసీఆర్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఎవరకీ పెద్దగా అందుబాటులో ఉండరు. కనీసం అంబేద్కర్ జయంతి కార్యక్రమాల సమయంలో ఆయన విగ్రహానికి పూల మాల వేయటానికి కూడా కెసీఆర్ బయటకు రారు. పార్టీ క్యాడర్ తో పాటు ప్రజలకు కూడా అందుబాటులో ఉండని ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తడం ఏంటని బీజేపి శ్రేణులు లోలోపల మదనపడుతున్నట్టు సమాచారం.