పోస్టులు: సిఎం కెసిఆర్కు ముఖ్య కార్యదర్శి ఝలక్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్న ఉన్నతాధికారి ఒకరు ఝలక్ ఇచ్చారు. కెసిఆర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆయన నిర్ణయం అమలు కాకుండా అడ్డు పడ్డారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సిందిగా కోరారు. సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి ఉన్నతాధికారులు అడ్డు చెప్పడం చాలా అరుదు.
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈవో, తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) మేనేజింగ్ డైరెక్టర్ పోస్టులు చాలా కాలం నుంచి ఖాళీగా ఉన్నాయి. తాజాగా ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న ప్రొఫెసర్ చంద్రశేఖర్ను, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీగా సాంఘిక సంక్షేమ శాఖలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న వేణుగోపాల్ను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన ఫైల్పై నాలుగు రోజుల క్రితం ఆయన సంతకం చేశారు.
అయితే వీరి నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయడం కోసం సంబంధిత ఫైల్ వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్చందా వద్దకు వచ్చింది. ఈ పేర్లను పరిశీలించిన సురేష్చందా ఫైలుపై తన అభ్యంతరాలను నమోదు చేశారు. ఆరోగ్యశ్రీకి ఐఏఎస్ స్థాయి అధికారే సీఈవోగా ఉండాలనే అభిప్రాయాన్ని ఫైల్లో వ్యక్తం చేశఆరు. ఈ పోస్టుకు ఐఏఎస్ పేరును పరిశీలించాల్సిందిగా ఫైల్ను తిరిగి పంపించారు.
ఆరోగ్యశ్రీ ట్రస్టుకు మొదటి నుంచి ఐఏఎస్ అధికారులే సీఈవోలుగా ఉంటున్నారని, ఆ అధికారి పలు శాఖల ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని, ఇప్పుడు ప్రతిపాదించిన వైద్య నిపుణుడి వల్ల అది సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అదే విధంగా టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ పోస్టు కూడా పెద్దదని, ఇంతకు ముందు ఈ పదవిలోనూ ఐఏఎస్ లేదా ఉన్నతస్థాయి అధికారులు కొనసాగారని గుర్తుచేస్తూ, అలాంటి ప్రతిష్ఠాత్మక పదవిలో జేడీ స్థాయి అధికారిని నియమించడం సరికాదని సురేష్ చందా అభ్యంతరం వెలిబుచ్చినట్లు సమాచారం.