మెదక్ నుండి ప్రియాంకగాంధీ పోటీ, ఆ సెంటిమెంటే కారణమా?
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంకగాంధీ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
మెదక్: ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంకగాంధీ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రియాంను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి దింపేందుకు ప్రయత్నాలను సాగిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఒకవేళ ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే వచ్చే ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానం నుండి పోటీచేసే అవకాశాలు కూడ ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత పలు రాష్ట్రాల్లో కూడ ఆ పార్టీ క్రమేపీ బలహీనపడుతోంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు కూడ అస్త్ర సన్యాసం చేస్తున్న పరిస్థితులు కన్పిస్తున్నాయి.
కొందరు పార్టీ నేతలు పార్టీని వీడారు. వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడంలో కూడ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది.
ఈ సమయంలోనే రాహుల్గాంధీ నాయకత్వంపై కూడ కొందరు నేతలు విమర్శలు గుప్పించారు. ఈ తరుణంలోనే ప్రియాంకగాంధీ రాజకీయాల్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం కోసం అవకాశాలు మెండుగా ఉంటాయని కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయంతో ఉన్నారని ప్రచారం సాగుతోంది.
మెదక్ నుండి ప్రియాంక పోటీ?
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక వస్తే వచ్చే ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీచేసే అవకాశాలున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అయితే మెదక్ నుండి గతంలో ప్రియాంక నానమ్మ ఇందిరాగాంధీ పోటీ చేసి ఘనవిజయం సాధించారు. ఎమర్జెన్సీ తర్వాత ఈ పార్లమెంట్ స్థానం నుండి పోటీచేస్తే ప్రజలు ఆమెకు పట్టం కట్టారు. అంతేకాదు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో గాంధీ కుటుంబానికి మెదక్ పార్లమెంట్ స్థానం అంటే ప్రేమ ఎక్కువ అనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
మెదక్ సెంటిమెంట్ ఎందుకంటే?
ఇందిరాగాంధీ బతికున్న కాలంలో ప్రచారం చేసేందుకు వచ్చిన సమయంలో ఆమె రాక కోసం మెదక్ ప్రజలు ఆసక్తిగా సుమారు 13 గంటలకు పైగా వేచి చూశారు. దీంతో మెదక్ జిల్లా ప్రజలు 13 గంటలపాటు తన కోసం ఎదురుచూడడంతో ఇందిరాగాంధీ ఆశ్చర్యానికి గురయ్యారట. ఈ మీటింగ్ను తొలుత రద్దు చేసుకోవాలని భావించినా, ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలుసుకొని ఆమె ఆ మీటింగ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమె ఈ స్థానం నుండి పోటీచేసి విజయం సాధించారు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి కూడ ఆమె విజయం సాధించారు. అయితే ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని స్థానానికి రాజీనామా చేసి మెదక్ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించారు.
సంస్థాగత ఎన్నికల తర్వాత క్లారిటీ?
ఈ ఏడాది డిసెంబర్ నాటికి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఈ ఎన్నికల తర్వాత నాయకత్వ బాధ్యతలను రాహుల్గాంధీకి అప్పగించే అవకాశాలు లేకపోలేదు.అయితే మరోవైపు ప్రియాంకగాంధీకి కూడ నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం కూడ ఉంది. అయితే కొందరు పార్టీ నాయకులు ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలను మాత్రం తోసిపుచ్చడం లేదు. కానీ, పార్టీ నాయకత్వ బాధ్యతలను రాహుల్కు అప్పగించే అవకాశాలున్నాయని సమాచారం.
ప్రియాంక ప్రచారంతో కాంగ్రెస్కు ప్రయోజనం
దేశ వ్యాప్తంగా ప్రియాంక కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం ఉంటుందని ఆ పార్టీ సీనియర్లు కొందరు భావిస్తున్నారు. అయితే అదే సమయంలో ఆమెకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి పదవిని కూడ ఇవ్వాలని కోరే నాయకులు కూడ ఉన్నారు. అయితే రాహుల్కు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశాలు కన్పిస్తున్నాయి.ఇందిరాగాంధీ పోలికలు ఎక్కువగా ప్రియాంకలో కన్పిస్తాయి. దీంతో ఓటర్లను తనవైపుకు తిప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న ఫలితాన్ని సాధించే అవకాశం ఉందని పార్టీలో కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.