హైదరాబాద్ : శ్రీచైతన్య కాలేజీ ఎదుట లెక్చరర్ ఆత్మహత్యాయత్నం...
హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శ్రీ చైతన్య కాలేజీ ఎదుట గురువారం(ఫిబ్రవరి 11) ఓ లెక్చరర్ ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే స్థానికులు ఆయన్ను అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు.
ఆత్మహత్యకు యత్నించిన లెక్చరర్ను జువాలజీ లెక్చరర్ డా.హరినాథ్గా గుర్తించారు. హరినాథ్ మాట్లాడుతూ.. గత 25 సంవత్సరాలుగా లెక్చరర్గా పనిచేస్తున్న తాను గత 10 నెలలుగా దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నట్లు చెప్పారు. తన 25 ఏళ్ల వృత్తిలో ఎంతోమంది విద్యార్థులను వైద్యులుగా, ప్రయోజకులుగా తీర్చిదిద్దానని... కాలేజీ గుర్తింపు కోసం అనుక్షణం శ్రమించానని చెప్పారు. కానీ గత 10 నెలలుగా జీతభత్యాలు లేక కనీసం భార్యా,పిల్లలకు కనీసం పూట కడుపు నిండా తిండి కూడా పెట్టలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రస్తుతం కాలేజీ ప్రారంభమైనా తన వయసును సాకుగా చూపుతూ డీన్ రవికాంత్ వేధింపులకు గురిచేస్తున్నాడని హరినాథ్ ఆరోపించారు. వ్యక్తిగత కక్షతో తనను విధుల్లోకి తీసుకోవడం లేదని ఆరోపించారు. తన బాధను ఎన్నిసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించినా రవికాంత్ అడ్డుపడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అతనివల్ల తన కుటుంబం రోడ్డుపాలైందని.. తనను విధుల్లోకి తీసుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. హరినాథ్ ఆవేదనను అర్థం చేసుకున్న పోలీసులు ఆయనకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
కాగా,కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రైవేట్ టీచర్లు,లెక్చరర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో చాలామంది ప్రైవేట్ టీచర్లు కూలీలుగా,పండ్ల వ్యాపారులుగా మారిపోయారు.కుటుంబాన్ని పోషించుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో తోచిన పని చేసుకుంటూ పొట్ట నింపుకుంటున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాలకు కూడా మొరపెట్టుకున్నప్పటికీ అటువైపు నుంచి ఎటువంటి స్పందన లభించలేదు.