ఏపీపై వెంకయ్య విజ్ఞప్తి బేఖాతరు! తెలంగాణకు ప్రత్యేక హోదా కోసం వినోద్ బిల్లు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ శుక్రవారం నాడు లోకసభలో ప్రయివేటు మెంబర్ బిల్లు ప్రతిపాదించారు. తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షం, ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ ఏకంగా ప్రయివేటు బిల్లు ప్రతిపాదించడం గమనార్హం.
వారం రోజుల క్రితం వెంకయ్య లోకసభలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని నేను కూడా ఆకాంక్షిస్తున్నానని, నీతి అయోగ్ పరిశీలనలో ప్రత్యేక హోదా అంశం ఉందని చెప్పారు. దేశ సమగ్రతను, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలు పని చేయాలన్నారు.
ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కోరుతున్నాయని చెప్పారు. అభివృద్ధి చెందిన పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా అడుకుతున్నాయని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సమగ్ర అభివృద్ధిని రాష్ట్రాలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ లోటు బాగా ఉన్నందునే ప్రత్యేక హోదా అడుతున్నారని వెంకయ్య నాయుడు చెప్పారు. ఏపీకి హోదా వస్తేనే రాష్ట్ర అభివృద్ధి త్వరితగతిన సాగుతుందన్నారు. కానీ, వెంకయ్యకు షాకిస్తూ.. వినోద్ కుమార్ ప్రత్యేక హోదా కోసం బిల్లు ప్రతిపాదించారు!