తెలుగులో శుభాకాంక్షలు తెలియజేసిన ప్రియాంకాగాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంకాగాంధీ తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేకంగా తెలంగాణ ఆడపడుచులకు శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా తెలుగులోనే చేయడం విశేషం. ట్వీట్ తోపాటు 1978లో తన నాయనమ్మ ఇందిరాగాంధీ వరంగల్ లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారని తెలియజేస్తూ ఆ ఫొటోను కూడా యాడ్ చేశారు. త్వరలో తెలంగాణలో మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి భారతీయ జనతాపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఉప ఎన్నిక అనివార్యమవడంతో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని బరిలోకి దింపింది. కోమటిరెడ్డి బీజేపీ తరఫున బరిలోకి దిగగా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు.
కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది రాష్ట్రాల వ్యవహారాలను ప్రియాంక గాంధీ పర్యవేక్షిస్తున్నారు. బతుకమ్మ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం కావడంతో ఆమె తెలుగులోనే శుభాకాంక్షలు తెలియజేయడంపై ఆ పార్టీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. ఈ ఉత్సాహంలోనే రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తామని చెబుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఎవరు పోటీపడతారనే విషయంలో స్పష్టత వస్తే గెలుపోటములు ఎవరికి ఉంటాయనేది అంచనా వేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ తరఫున ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే అవడంతో టీఆర్ ఎస్ బీసీ వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేయవచ్చని భావిస్తున్నారు. అప్పుడు ఎన్నిక ఏ మలుపు తీసుకుంటుందనేది స్పష్టమవుతుందని భావిస్తున్నారు.