priyanka reddy murder... సీఎం కేసీఆర్ స్పందించరేం.. మంత్రుల వ్యాఖ్యలు అనుచితం : ప్రతిపక్షాల ఫైర్
ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్, హత్య విషయంలో ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. నేరస్తులకు శిక్ష వేయడంలో తాత్సారం చేస్తే ఊరుకునేది లేదని అటు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై ప్రభుత్వం తీరుపై ప్రతిపక్ష పార్టీలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
priyanka reddy murder..జాతీయ మహిళా కమిషన్ సభ్యుల విచారణ ప్రారంభం...ప్రియాంక తల్లిదండ్రులకు పరామర్శ
ఆడపిల్లలకు రక్షణ లేదన్న కాంగ్రెస్ నేత జానారెడ్డి
కాంగ్రెస్ పార్టీ నేతలు జానా రెడ్డి , జీవన్ రెడ్డి తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా ప్రియాంక రెడ్డి హత్య ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇక మంత్రులు మాట్లాడుతున్న తీరు అనుచితంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ప్రియాంక రెడ్డి హత్య కేసు వంటి ఘటనలతో తెలంగాణలో ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బయటకు వెళితే ఇంటికి వచ్చే దాకా నమ్మకం లేదని ఆవేదన
ఆడపిల్లలు బయటికెళితే ఇంటికొచ్చే వరకు తల్లిదండ్రులు భయపడుతూనే ఉంటున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇలాంటి పరిస్థితి నుండి ఆడపిల్లలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని జానారెడ్డి పేర్కొన్నారు . ఇక తెలంగాణ రాష్ట్ర మంత్రి మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు చాలా విచిత్రంగా ఉన్నాయని జానారెడ్డి వ్యాఖ్యానించారు . 100 కు ఫోన్ చేయలేదని హోంమంత్రి పేర్కొనడం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన అన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జానారెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలి అని జానారెడ్డి పేర్కొన్నారు.
పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం అన్న జీవన్ రెడ్డి
ఇక ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆడవాళ్ల వైపు చూస్తే గుడ్లు పీకేస్తామన్న సీఎం కేసీఆర్ డాక్టర్ ప్రియాంక రెడ్డి పై అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేసే హతమార్చినా స్పందించకపోవడం దారుణమని కాంగ్రెస్ నేత జీవన్రెడ్డి పేర్కొన్నారు. ప్రియాంక రెడ్డి తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ దారుణం జరిగిందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 100కు ఎందుకు ఫోన్ చేయలేదని హోంమంత్రి అనడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. పోలీసుల నిర్లక్ష్యం లేదని సీపీ చెప్పడం ఆశ్చర్యమని జీవన్రెడ్డి పేర్కొన్నారు. మద్యాన్ని ఆదాయవనరుగా చూస్తున్నారని.. అనర్థాలను గుర్తించడం లేదన్నారు. మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పేర్కొన్నారు జీవన్ రెడ్డి . నిందితులను ఉరితీయడమే కరెక్ట్ అని ప్రజలు భావిస్తున్నారన్నారని జీవన్రెడ్డి పేర్కొన్నారు.
కేసీఆర్ మాట్లాడరే .. ఎక్కడున్నాడు అంటూ బీజేపీ నేత డీకే అరుణ ఫైర్
ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై బిజెపి నేత డీకే అరుణ విమర్శలు గుప్పించారు.వైద్యురాలి హత్యను నిరసిస్తూ ఇందిరాపార్క్ దగ్గర బీజేపీ ధర్నా కార్యక్రమం చేపట్టనుందని ఆ పార్టీ నేత డీకే అరుణ పేర్కొన్నారు. ఉపఎన్నికల్లో గెలవగానే కేసీఆర్ ప్రెస్మీట్ పెడతాడని అలాంటిది.. రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు జరగుతుంటే కేసీఆర్ ఎక్కడున్నాడని డీకే అరుణ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగినా చెప్పుకోవడానికి దిక్కు లేదని డీకే అరుణ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణ గాలిలో దీపంలా మారిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video
ప్రభుత్వంపై ,సీఎం కేసీఆర్ పై ఆగ్రహం
ప్రస్తుతం ప్రియాంక రెడ్డి దారుణ హత్య నేపథ్యంలో అటు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు మాత్రమే కాకుండా ప్రతిపక్ష పార్టీలు సైతం తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నాయి. ప్రభుత్వ అసమర్థత వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆరోపణలు వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి తగిన చర్యలు తీసుకోవాలని, ఇక ఈ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు.