Priyanka reddy murder:రాత్రంతా సంఘటనా స్థలంలో నిందితులతో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు ..
డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురై,హత్య భావించబడిన సంఘటన యావత్ భారతదేశాన్ని కదిలించి వేస్తోంది. మన చట్టాలను, మన న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితికి ప్రజల నుండి తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది.
నలుగురు మృగాళ్ల చేతిలో దారుణంగా అత్యాచారం గావించ బడి,హత్యకు గురైన ప్రియాంక రెడ్డి కేసులో నలుగురు నిందితులను పోలీసులు రాత్రి సంఘటనా స్థలానికి తీసుకువెళ్లారు.డాక్టర్ ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్ మరియు హత్య కేసులో ఘటనకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు రాత్రంతా విచారించారు. ఘటనా స్థలం వద్దకు వారిని తీసుకెళ్లిన పోలీసులు నేరం జరిగిన తీరును పరిశీలించారు. ప్రియాంక రెడ్డి విషయంలో వారు ఏం చేశారు ..ఎలా చేశారు, ఎక్కడికి తీసుకెళ్ళారు.. ఏ విధంగా తీసుకెళ్ళారు అన్న అంశాలపై విచారణ జరిపి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు.
రాత్రంతా పోలీసులు నిందితులను విచారించారు. వారు పలు షాకింగ్ అంశాలు పోలీసులకు వెల్లడించినట్టు తెలుస్తుంది. ప్రియాంక రెడ్డిని అత్యాచారం చేసి కీచక పర్వానికి పాల్పడిన నలుగురు యువకులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు నిందితులను నేడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
నిందితుల్లో ప్రధాన సూత్రధారి మహమ్మద్ వయసు 26 సంవత్సరాలు. మిగతా ముగ్గురు వయసు 20 సంవత్సరాలే. అయినప్పటికీ సభ్య సమాజం షాక్ కు గురయ్యేలా వీరు ప్రియాంక రెడ్డి ని గ్యాంగ్ రేప్ చేసి హతమార్చిన తీరు దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమవుతుంది. నేడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వీరిని ప్రవేశపెట్టనున్న పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి కోరనున్నారు.