priyanka reddy murder..జాతీయ మహిళా కమిషన్ సభ్యుల విచారణ ప్రారంభం...ప్రియాంక తల్లిదండ్రులకు పరామర్శ
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య కేసుపై సీరియస్ అయిన జాతీయ మహిళా కమీషన్ ఈ కేసును సుమోటోగా తీసుకుంది .ఇక దేశ రాజధాని ఢిల్లీలోని నిర్బయ ఘటనను తలపిస్తున్న ప్రియాంకరెడ్డి హత్యఘటన పై నేడు జాతీయ మహిళా కమీషన్ సభ్యులు హైదరాబాద్ లో విచారణ చేపట్టారు. శంషాబాద్లో ప్రియాంక నివాసానికి వెళ్లారు. ఆమె తల్లిదండ్రులను మహిళా కమిషన్ సభ్యులు పరామర్శించారు.
Priyanka reddy murder: పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..చెట్టుకు 4గురి దిష్టిబొమ్మలను ఉరి తీసి నిరసన
విచారణ ప్రారంభించిన జాతీయ మహిళా కమీషన్ సభ్యులు
ప్రియాంకా రెడ్డి అత్యంత పాశవికంగా గ్యాంగ్ రేప్ తో పాటు దారుణ హత్యకు గురైన ప్రాంతాన్ని కూడా మహిళా కమిషన్ సభ్యులు పరిశీలించారు. అక్కడ సమీపంలోని టోల్ ప్లాజా దగ్గర ఉన్నవారితో మాట్లాడారు. హైవేపై పోలీసుల పెట్రోలింగ్ లేకపోవడం వల్లనే దారుణం జరిగిందని కమిషన్ సభ్యులు భావిస్తున్నారు. అస్పష్టంగా కనిపించే సీసీ కెమెరాలతో ప్రయోజనమేంటని కమిషన్ సభ్యులు తెలంగాణా పోలీసులను ప్రశ్నిస్తున్నారు.
సంఘటనా స్థల యజమానికి నోటీసులు జారీ చెయ్యనున్న కమీషన్
సంఘటనా స్థలంలో ఉన్న నిర్మాణం విషయంలో వారు స్థల యజమానితో విచారించనున్నారు. గోడ తొలగించడంపై కమిషన్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక సంఘటనా స్థల యజమాని నాగరాజుకు నోటీసులు జారీ చేయాలని కమిషన్ సభ్యులు పేర్కొన్నారు.జాతీయ మహిళా కమిషన్ ఈ ఘటన విషయంలో నిందితులను కఠినంగా శిక్షించేవరకు పోరాడుతామని స్పష్టం చేసింది.
తెలంగాణా ప్రభుత్వాన్ని నివేదిక కోరిన జాతీయ మహిళా కమీషన్
ఇక ప్రియాంకా రెడ్డి కేసు దర్యాప్తుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణా ప్రభుత్వాన్ని,సంబంధిత అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే . ఈ మేరకు హైదరాబాద్ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ ఓ లేఖ రాసింది. ఇక జాతీయ మహిళా కమీషన్ సైతం కేసు విచారణకు ఓ బృందాన్ని పంపుతున్నట్లు పేర్కొంది. నేడు ఆ బృందం విచారణ కొనసాగిస్తుంది. అంతే కాదు ప్రియాంకా రెడ్డి తల్లి దండ్రులను కలిసి వారికి ధైర్యం చెప్పి నిందితులను శిక్షించేలా చూస్తామని పేర్కొన్నారు .
Recommended Video
జాతీయ మహిళా కమీషన్ ఈకేసును సీరియస్ గా తీసుకోవటంపై మహిళల హర్షం
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది మహిళలు, హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారని ఇలాంటి దారుణ ఘటనలు జరిగితే మహిళలు స్వేచ్ఛగా ఎలా తిరగగలుగుతారని మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే . ఈ కేసు విషయంలో జాతీయ మహిళా కమీషన్ దృష్టి సారించి విచారణకు బృందాన్ని పంపటంపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా మహిళా కమీషన్ దృష్టి సారించాలని కోరుతున్నారు.