Priyanka reddy murder: ఆగని ఆందోళన, పోలీసుల లాఠీ చార్జ్, షాద్ నగర్ పీఎస్ గేట్లకు బేడీలు
ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్, హత్య విషయంలో ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. నేరస్తులకు శిక్ష వేయడంలో తాత్సారం చేస్తే ఊరుకునేది లేదని అటు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశంలో సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్, హత్య కేసులో లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రియాంక రెడ్డి తన సోదరి భవ్య కు చేసిన ఫోన్ కాల్ ఆధారంగా, సిసి టీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకొని కేసును త్వరితగతిని ఛేదించారు.
priyanka reddy murder... సీఎం కేసీఆర్ స్పందించరేం.. మంత్రుల వ్యాఖ్యలు అనుచితం : ప్రతిపక్షాల ఫైర్
షాద్ నగర్ పోలీసు స్టేషన్ వద్ద కొనసాగుతున్న ఆందోళన
ఇక ఈ కేసుకు సంబంధించి ప్రియాంక రెడ్డి పై గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేశారు.దీంతో ప్రియాంక రెడ్డి హత్య కేసులో దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇక నేడు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉండగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వారిని ప్రజలకు అప్పగించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. స్థానికులు , ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థినులు షాద్ నగర్ పోలీసు స్టేషన్ వద్ద దాదాపు 5 గంటలుగా ఆందోళన చేస్తున్నారు.
ఆందోళనకారులపై పోలీసుల లాఠీ చార్జ్
ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులు ప్రస్తుతం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న నేపథ్యంలో వందల సంఖ్యలో నిరసనకారులు అక్కడకు చేరుకున్నారు. పీఎస్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది.అయినా వెనక్కు తగ్గకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని నిరసనకారులు పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు.
Recommended Video
స్టేషన్ గేటు మూసివేత .. గేటుకు బేడీలు
ఈ నేపథ్యంలో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. స్టేషన్ గేటును మూసేశారు. గేటుకు వేయడానికి తాళాలు లేకపోవడంతో దానికి బేడీలు వేశారు. పీఎస్ గేటుకు బేడీలు వేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రియాంకా రెడ్డి విషయంలో ఆందోళనలు మిన్ను ముడుతున్నాయి. అవి కేవలం రాష్ట్రానికే పరిమితం కాలేదు. దేశ వ్యాప్తంగా ఈ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రియాంక హంతకులను ఉరి తీయాల్సిందే అని, ఎన్ కౌంటర్ చేయాల్సిందే అని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రియాంక రెడ్డి హత్యకు కారణమైన ఆ నలుగురు మృగాళ్ళకు మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్న వారి ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో, ఆందోళన చేస్తున్న వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది.