రెవెన్యూ కార్యాలయాల్లో పీఆర్ఓ విధానం: రెవెన్యూ ఉద్యోగుల రక్షణకు టీ సర్కార్ నిర్ణయం
తహసిల్దార్ విజయ రెడ్డి హత్య తర్వాత ఎమ్మార్వో కార్యాలయాల్లో ఉద్యోగులు తీవ్ర అభద్రతా భావంతో ఉన్నారు ఇక ఈ పరిస్థితి నుండి వారికి రక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుండి ఎమ్మార్వో కార్యాలయంలో ప్రజలు అధికారులతో నేరుగా కలిసేందుకు వీలులేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరైనా సరే తహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన రైతులు ముందుగా పి ఆర్ ఓ ని కలిసేలా, పి ఆర్ ఓ వ్యవస్థను తీసుకువస్తుంది తెలంగాణ సర్కార్.
రెవెన్యూ అధికారులకు ప్రజలకు మధ్య వారధిగా పీఆర్వో వ్యవస్థ
రెవెన్యూ అధికారులకు ప్రజలకు మధ్య మరో వ్యవస్థ రాబోతోంది. ఆర్డిఓ కార్యాలయాలు, ఎమ్మార్వో కార్యాలయాలలో పి ఆర్ ఓ వ్యవస్థను రూపొందించడం కోసం నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నో సమస్యలతో రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలు నేరుగా ఆఫీసుల్లో పని చేసే ఉద్యోగుల వద్దకు వెళ్ళకుండా పీఆర్వో లను కలవాల్సి ఉంటుంది. వారే అటు అధికారులకు , ఇటు ప్రజలకు మధ్య వారధిగా ఉండి జవాబుదారీగా వ్యవహరిస్తారు.
ప్రజల సమస్యలు చెప్పుకోవలసింది పీఆర్వోలకే
ప్రజలకు సంబంధించిన సమస్య ఏదైనా పీఆర్వో దగ్గరకు తీసుకు వెళితే ఆ సమస్యకు సంబంధించి కార్యాలయంలో పని ఎంతవరకు జరిగింది. అధికారులు ఏం చెప్తున్నారు. ఎప్పటి వరకు పని పూర్తి చేస్తారు వంటి అంశాలను లిఖితపూర్వకంగా పి ఆర్ ఓ లు ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజల యొక్క వినతి పత్రాలను అధికారులకు అందజేయడం, అధికారులు పనికి సంబంధించి చెప్పిన వివరాలను ప్రజలకు అందజేయటం పి ఆర్ వో లు చేస్తారు.
పీఆర్ఓ వ్యవస్థ ద్వారా జవాబుదారీ తనం పెరుగుతుందని సర్కార్ యోచన
ఒక రకంగా చెప్పాలంటే అటు అధికారులకు, ఇటు ప్రజలకు మధ్య వారధిగా పీ ఆర్వో వ్యవస్థ ఉండబోతుంది. ఇంకా ఈ విధమైన పీఆర్వో వ్యవస్థ ద్వారా ప్రజలకు జవాబుదారీగా ఉండడమే కాకుండా, లిఖితపూర్వకంగా ఎప్పటికప్పుడు పని పురోగతిపై వివరణ ఇస్తారు కాబట్టి రెవెన్యూ కార్యాలయాల్లో అటు ఉద్యోగుల పనితీరు మెరుగుపడుతుందని, ఇటు ప్రజల నుండి రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ దొరుకుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
ఈ పరిస్థితికి రెవెన్యూ ఉద్యోగుల అవినీతి కారణం అంటున్న ప్రజా సంఘాలు
అయితే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు పనుల విషయంలో జాప్యం చేయడం, అవినీతికి పాల్పడటం వంటి చర్యలతో నే ప్రజల్లో సహనం నశించి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ప్రజా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అవినీతి రహితంగా విధులు నిర్వర్తిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని వారంటున్నారు. అంతేకాదు పీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేసినంత మాత్రాన సమస్యకి ఇది శాశ్వత పరిష్కారం కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రెవెన్యూ కార్యాలయంలో పి ఆర్ వో వ్యవస్థను అమలు చేయడం ద్వారా కొంతమేరకు సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.