ఈటెలకు సవాళ్ల స్వాగతం..! డాక్టర్ల కొరతతో వెక్కిరిస్తున్న పీహెచ్ సీ లు..!!
హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన సౌకర్యాలు కల్పించి రోగుల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తానన్నారు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈ టెల రాజేందర్. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాద్యతలు చేపట్టిన ఈటెలకు సవాళ్లుకూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం దవాఖానాలో మౌళిక వసతులు, సిబ్బంది కొరత, ఏళ్లతరబడి పేరుకుపోయిన అవినీతి ని ఎలా అదిగమిస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇక జిల్లా కేంద్రాల్లో సరైన వసతులు, సిబ్బంది లేక ప్రజల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లంటేనే అభద్రతాభావం ఏర్పడ్డ ప్రస్తుత తరుణంలో వాటిని ఎలా ప్రక్షాళణ చేస్తారనేది కూడా మంత్రి ఈటెలకు కత్తి మీద సాములాంటిదే..!
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పేదలకు వైద్యం..! అమలయ్యేల చర్యలు చేపడతామన్న కొత్త మంత్రి..!!
ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే సరిగ్గా పట్టించుకోరన్న భావనను రూపుమాపి,నమ్మకమైన వైద్యం అందుతుందన్న భరోసా కల్పించడమే తన ముందున్న లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇందుకోసం ఆస్పత్రి యాజమాన్య వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి పెడతానని తెలిపారు. ఏ రాష్ట్రంలోనైనా విద్య, వైద్య రంగాలు చాలా కీలకమని, అందుకే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వాటికి సముచిత స్థానం ఇచ్చారని అన్నారు. ఎక్కడైనా నాణ్యమైన మానవ సంబంధాలు ఉంటేనే ఆ రాష్ట్రం బాగుంటుందని ఈటెల అన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులపై భరోసా కల్పిస్తాం..! మౌళిక సదుపాయాలు మెరుగుపరుస్తామన్న ఈటెల..!
గత నాలుగున్నరేళ్లలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సహకారంతో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి వైౖద్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చారని ఈటెల గుర్తు చేసారు. కేసీఆర్ కిట్, కంటి వెలుగు, ఆస్పత్రుల అప్గ్రెడేషన్, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, సీఎం రిలీఫ్ ఫండ్ పెంచడం, ఆస్పత్రుల్లో మరణించిన వారి మృతదేహాలను తరలించేందుకు వాహనాల ఏర్పాటు వంటి చర్యలతో ప్రజల్లో విశ్వాసం పొందగలిగామని అన్నారు. సర్కారీ వైద్యంపై నమ్మకం కలిగించగలిగామని. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని కొత్త వైద్య ఆరోగ్య మంత్రి తెలిపారు.
సిబ్బంది కొరతను ఎలా అదిగమిస్తారు..! ప్రజల్లో నమ్మకాన్ని ఎలా తీసుకొస్తారు..?
వైద్య సిబ్బంది కొరతను ఎలా అధిగమిస్తారన్న ప్రశ్నకు ఈటెల ఆసక్తికర సమాధానం చెప్పారు. వైద్యులు, సిబ్బంది, యంత్ర పరికరాలకు సంబంధించి కొరత ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. కొన్ని ఆస్పత్రుల్లో ఈ పరిస్థితిని అదిగమించామని, ఇంకా మిగిలిన వాటిని గుర్తించి సమస్యలను పరిష్కరించుకుంటామని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని అన్నారు. ప్రజల్లో ప్రభుత్వ దవాఖానాల మీద, ఆస్పత్రి యాజమాన్య వ్యవస్థ మీద నమ్మకం ఉండాలని, కేవలం వైద్యమే కాకుండా వారిని కమ్యూనికేషన్ చేసే పద్దతి కూడా ఉండాలని ఈటెల రాజేందర్ తెలిపారు.
మంత్రిగా చేయబోతున్నది ఏంటి..? మెరుగైన వైద్య విధానాన్ని ఎలా అమలు చేస్తారు..?
ప్రభుత్వ వైద్య సేవల విషయంలో తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే తన కర్తవ్యమని, అందుకోసం లోతైన అధ్యయనం చేసి, సమస్యల పరిష్కారానికి తన వంతు క్రుషి చేస్తానని ఈటెల అన్నారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుధ్యం మెరుగుపడిందని, మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం సర్కారీ వైద్యుల్లో అంకిత భావం బాగా పెరిగిందని ఈటెల చెప్పుకొచ్చారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో రోగులకు సేవలు సరిగా అందడం లేదని, కొన్నింటిలో 750 చొప్పున పడకలు ఉన్నాయని, వాటిలో పేద ప్రజలకు సేవలందేలా చూడాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం ఆ దిశగా సమాలోచనలు చేస్తుందని ఈటెల రాజేందర్ స్పష్టం చేసారు.