టీ జన సమితి కోదండరాం పోటీ ఎక్కడ నుంచి..? అనుకూల నియోజక వర్గాలు ఇవేనా..!!
తెలంగాణ ప్రజానీకానికి రాజకీయంగా సరైన న్యాయం జరగడం లేదంటూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదంటూ ప్రొఫెసర్ కోదండరాం గతంలో ఘాటు వ్యాఖ్యలు చేసారు. అందుకు తగ్గట్టే పొలిటికల్ జేఏసీ నుండి తప్పుకుని రాజకీయ పార్టీ ని స్థాపించారు. తాజాగా రాజకీయ వేదికను ఖరారు చేసుకునే పనిలో పడ్డారు కోదండరాం. తెలంగాణాలో ఏ నియోజకవర్గం నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాలా ? అని సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటి చేసి జన సమితి లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కోదండరాం సన్నాహాలు చేస్తున్నారు. కాగా తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసేది మాత్రం సస్పెన్స్ గా మారింది.
కోదండరాం రాజకీయ అడుగులు.. నియోజకవర్గ ఎంపికలో నిమగ్నమైన ప్రొఫెసర్..
జనగామ నియోజక వర్గం నుండి కోదండరాం పోటీ చేస్తారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కోదండరాం జనగామలో పోటీ చేయడానికి గల కారణాలను విశ్లేషిస్తే.. జనగామలో ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందని జన సమితి నేతలు అంచనా వేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ముత్తిరెడ్డికి టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని, లేదంటే ఒకవేళ ముత్తిరెడ్డికి టికెట్ ఇవ్వకపోతే ఆయన లోపాయికారిగా జన సమితికి సహకారం చేయవచ్చన్న చర్చ జరుగుతోంది. దాంతోపాటు తెలంగాణ వచ్చిన తర్వాత జనగామ అభివృద్ధికి సర్కారు చేసిందేమీ లేదన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
పట్టణ ప్రాంత నియోజక వర్గాలపైనే కోదండరాం గురి..
జనగామలో రెడ్డీ సామాజికవర్గం బలంగా ఉండడంతో ఆ నియోజకవర్గానికి కేవలం జిల్లా కేంద్రం మంజూరూ తప్ప ఇంకేమాత్రం అభివృద్ధి చేయలేదన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. అందుకే కోదండరాం చేపట్టిన నిరహారదీక్షల సందర్భంగా సభను కూడా జనగామలోనే జరిపారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమకాలం మొదలుకొని, జన సమితి పెట్టేంతవరకు కూడా జనగామ కేంద్రంగా కోదండరాం కార్యకలాపాలు జరిపినట్టు తెలుస్తోంది. కాగా జనగామలో మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఉండగా కోదండరాం పోటీ చేయడం సాధ్యమేనా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ మహా కూటమి ఏర్పడితే పొన్నాలకు టికెట్ దక్కే అవకాశాలుంటాయి. అలాంటప్పుడు కోదండరాం పోటీ చేసే అవకాశం ఉండదనే చర్చ కూడా తెరమీదకు వస్తోంది.
ఎక్కడనుండి పోటీ చేసినా ప్రభావం చూపాలన్నది ప్రొఫెసర్ అభిమతం..
హైదరాబాద్ లోని ఉప్పల్ లో కోదండరాం పోటీ చేయవచ్చని కూడా మరో వాదన వినిపిస్తున్నది. ఉప్పల్ లో చదువుకున్న ఓటర్ల సంఖ్య ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో మాదిరిగా ఏకపక్ష ఓటింగ్ విధానం సిటీలో ఉండదు. దాంతోపాటు విద్యవంతుల్లో కోదండరాం పట్ల మంచి అభిప్రాయం ఉంది. ఇవన్నీ పాజిటీవ్ అంశాలుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గ్రామీణ రాజకీయాలు, సిటీ రాజకీయాలు వేరుగా ఉంటాయన్న విషయం ఢిల్లీ ఎన్నికల్లో రుజువైందని అంటున్నారు. ఢిల్లీలో సాంప్రదాయ కాంగ్రెస్, బిజెపిలను పక్కకు నెట్టి ఆమ్ ఆద్మీ పార్టీని బంపర్ మెజార్టీతో జనాలు గెలిపించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు జన సమితి నాయకులు.
ప్రలోభాలకు ఆస్కారం ఇవ్వొద్దు.. రాజకీయాల్లో సచ్చీలత అవసరం...
విద్యావేత్తలు అదికంగా ఉన్నచోట ప్రలోభాలు పనిచేయవన్న భావన ఉంది. కోదండరాం మంచిర్యాల, లేదంటే ఉప్పల్ లో పోటీ చేయవచ్చని జనసమితి వర్గాల నుండి తెలుస్తోంది. జనగామలో పోటీ చేసేది ఒక ఆప్షన్ గా పెట్టుకున్నట్టు కోదండరాం అనుచరులు స్పష్టం చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో రెండు పర్యాయాలు డబ్బు, మద్యం పంచకుండానే ప్రొఫెసర్ నాగేశ్వర్ గెలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీ పరిణామాలు చూసినా, నాగేశ్వర్ ఎన్నిక చూసినా సిటీ రాజకీయాల వైపు కోదండరాం ఆలోచన చేయవచ్చని తెలుస్తోంది.