బాబు తప్పించుకోలేక సెక్షన్ 8: హరగోపాల్, ఫాంహౌస్లో కేసీఆర్తో స్టీఫెన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసు నుండి తప్పించుకోలేక సెక్షన్ 8ను తెరపైకి తీసుకు వచ్చారని ప్రొఫెసర్ హరగోపాల్ బుధవార మండిపడ్డారు. సెక్షన్ 8 అమలు చేస్తే బీజేపీ కూడా తప్పు చేస్తుందనే అర్థమని అభిప్రాయపడ్డారు.
సెక్షన్ 8 అంటే ప్రశాంతంగా ఉన్న ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టడమేనని హరగోపాల్ అన్నారు. ఓటుకు నోటు కేసులో బయటపడటం ఎలాగో తెలియకే చంద్రబాబు దానిని సామాజిక సమస్యగా మార్చారని మండిపడ్డారు.
రాజకీయ నాయకులు విలువలతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. తమకు వ్యక్తులు ముఖ్యం కాదని, విలువలు చాలా ముఖ్యమని చెప్పారు. హైదరాబాద్ ప్రజల జీవితాలను ఒక్క గవర్నర్ చేతిలో పెట్టడం ఏమాత్రం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
కేసీఆర్తో స్టీఫెన్ భేటీ
మెదక్ జిల్లా ఎర్రవల్లి ఫాం హౌస్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో స్టీఫెన్ సన్ భేటీ అయ్యారు. ఓటుకు నోటు వ్యవహారంపై వారు చర్చించారని తెలుస్తోంది.
స్టీఫెన్ సన్ - బాబు ఆడియోగా చెబుతున్న దాంట్లో ఎడిటింగ్ లేదు!
ఓటుకు నోటు వ్యవహారం కేసులో చంద్రబాబు, స్టీఫెన్ సన్ మాట్లాడిన టేలుపు అసలువేనని ఫోరెన్సిక్ సైన్స్ లేబేరోటరీ నిర్ధారించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కేసుకు సంబంధించి తమకు అందిన ఆడియో, వీడియో టేపుల్లో ఎలాంటి ఎడిటింగ్ కానీ, మార్పులు గానీ జరగలేదని స్పష్టం చేసిందని సమాచారం. దీంతో, ఏ క్షణంలోనైనా చంద్రబాబు స్వర నమూనాలు ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టును ఆశ్రయించే అవకాశముంది.