హోదాకు నా మద్దతు, 'హైదరాబాద్'పై బీజేపీ కుట్ర?: కంచ ఐలయ్య
విజయవాడ: సన్యాసులు పాలనా పగ్గాలు చేపడితే ప్రజలకు నష్టాలు, ఇబ్బందులే వస్తాయని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. ఒకసారి చరిత్రను తరిచి చూస్తే.. పూర్తి సన్యాసులు, సగం సన్యాసులు పాలన చేసిన చోట ప్రజలకు ఎన్ని కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు వచ్చాయో తెలుస్తుందన్నారు. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో, రాష్ట్రాల్లో జరిగిన పాలనను బేరీజు వేసుకుంటే నిజాలు తెలుస్తాయని చెప్పారు. దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో కంచ ఐలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీని ఓడించండి..
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు సీఎం పదవులను చేపడితే మంచి పాలనను అందిస్తారని ఐలయ్య ఆకాంక్షించారు. గత ఎన్నికల్లో తాను బీసీని అని చెప్పుకోవడం వల్లే మోడీ అధికారంలోకి వచ్చాడని ఆయన అన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లను వ్యతిరేకించే ఎవరైనా జాతిద్రోహులే అని స్పష్టం చేశారు.
టీటీడీ చైర్మన్ వివాదంపై
ఇక టీటీడీ చైర్మన్ గా ఓ యాదవ కులస్తుడిని నియమిస్తే ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు ఐలయ్య. దోపిడీకి మారుపేరు లాంటి ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధిని సీఎం చంద్రబాబు తన కేబినెట్లో పెట్టుకున్నారని, ఆయన్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. దేశంపైకి దండెత్తేవారిపై.. ముఖ్యంగా చైనాను మనం ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. బీరకాయ, బెండకాయ, పప్పులు తిని యుద్దం చేయగలరా? అని ప్రశ్నించారు.
ఇకనుంచి 'భీమ్ భూమికి జై'..
అమరావతి బౌద్ధభూమి అని, ఇక్కడ రాజధాని నిర్మాణానికి తాను అనుకూలమని, ఐలయ్య స్పష్టం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లు ఏదో మాతను తీసుకొచ్చి 'జైభారత్ మాత' అంటున్నారని, అసలు ఆ మాత ఎవరో?, ఎక్కడినుంచో తీసుకొచ్చారో మాత్రం చెప్పరని ఎద్దేవా చేశారు.
గురజాడకు తెలుసో లేదో కానీ.. దేశమంటే మట్టికాదోయ్ మనుషులోయ్ అని ఆయన చెబితే.. అంతా దాన్నే పట్టుకున్నారని అన్నారు. మట్టిలేనిదే మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోవాలని, ఇక నుంచి బహుజనులంతా భీమ్ భూమికి జై అనే నినాదాన్ని ప్రచారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
హోదాకు మద్దతు, 'హైదరాబాద్'పై కుట్ర?:
ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమానికి తాను మద్దతు పలుకుతున్నట్టు కంచ ఐలయ్య తెలిపారు. దక్షిణాదిపై బీజేపీ దండయాత్ర అంటూ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని అన్నారు. దక్షిణాది అంతా ద్రవిడ రాజ్యమేనని తెలిపారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న సమాచారం తనవద్ద ఉందన్నారు.