తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు ప్రొ. కేశవరావ్ జాదవ్ కన్నుమూత
హైదరాబాద్: తెలంగాణ తొలి తరం ఉద్యమకారుడు, అణగారిన వర్గాల జన గొంతుక, పౌరహక్కుల సంఘం నేత కేశవరావ్ జాదవ్(85) అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రత్యేక తెలంగాణ కోసం ముల్కి ఉద్యమం నుంచి ప్రతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున స్వగృహంలో కేశవరావ్ జాదవ్ కన్నుమూశారు. హైదరాబాద్లోని హుస్సేని ఆలంలో 1933 జనవరి 27వ తేదీన కేశవరావ్ జాదవ్ జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాటం, నాన్ముల్కీ గో బ్యాక్ ఉద్యమం, జై తెలంగాణ పోరాటం, తెలంగాణ ఉద్యమ మలి దశ పోరాటాల్లో కేశవరావ్ జాదవ్ క్రీయాశీల పాత్ర పోషించారు.
తెలంగాణ జన పరిషత్కు కన్వీనర్గా పనిచేశారు. మానవ హక్కుల ఉద్యమాలు, ప్రాంతీయ ఉద్యమాలు, వామపక్ష ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, కుల ఉద్యమాలు, నక్సలైటు పోరాటాలు ఇలా జాదవ్ గొంతెత్తని ఉద్యమం లేదు. ఉస్మానియా యూనివర్సిటిలో ప్రోఫెసర్గా పనిచేసి పదవి విరమణ చేసిన ఆయన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రోఫెసర్ జయశంకర్తో కలిసి పలు ఉద్యమాల్లో కీలక భూమికను నిర్వహించారు.
1997, సెప్టెంబర్ 28న ప్రొఫెసర్లు జయశంకర్, కేశవరావ్ జాదవ్ ఆధ్వర్యంలో విడివిడిగా పనిచేస్తున్న 28 సంఘాలు కలిసి తెలంగాణ ఐక్య వేదికగా ఏర్పడ్డాయి. తెలంగాణ భావజాల ప్రచారంలో ఈ సంస్థ తనవంతు పాత్రను పోషించింది. తొలి తెలంగాణ ఉద్యమంలో జాదవ్ 17 సార్లు అరెస్టు అయ్యారు. దాదాపు రెండేళ్లు ఆయన జైలు జీవితం గడిపారు.
ప్రముఖుల సంతాపం
కేశవరావ్ జాదవ్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. జాదవ్ కుటుంబ సభ్యలకు ఈ సందర్భంగా ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ సాధనలో జాదవ్ సేవలు చిరస్మరణీయమన్నారు. కేశవరావు జాదవ్ భౌతిక కాయానికి తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
కేశవరావు జాదవ్ మృతదేహానికి ఎంపీ బండారు దత్తాత్రేయ, శంకర్రావు మేల్కొటే తదితరులు సంతాపం తెలిపారు. కేశవరావు జాదవ్ మృతిపట్ల కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో జాదవ్ కీలక పాత్ర పోషించారన్నారు.